కేసీఆర్‌.. రాజకీయ మాయల మరాఠీ.. రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో దిట్ట.. ఎప్పుడు జనం మూడ్ ఎలా ఉందో.. ఎప్పుడు ఏ అస్త్రం వాడాలో.. బాగా తెలిసిన వాడు.. అలాంటి కేసీఆర్ ఇప్పుడు ఆరున్కొక్క రాగంలో కొత్తగా దళిత గీతం ఆలపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. చాలామంది ఈ దళిత బంధు హుజూరాబాద్ ఎన్నికల కోసం తెచ్చాడని భావిస్తారు. హుజూరాబాద్‌లో ఈటలపై ఎలాగైనా గెలిచేందుకు కేసీఆర్ ఈ దళిత బంధు పథకం తెచ్చాడని.. అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న దళితుల ఓట్ల కోసమే కేసీఆర్ ఈ పథకం రూపొందించారని భావిస్తుంటారు.


అందుకే ఈ పథకానికి కారణం ఈటల రాజేందర్‌ అని బీజేపీ ప్రచారం కూడా చేసుకుంటోంది. అయితే.. ఆ విషయం ఎలా ఉన్నా.. కేసీఆర్‌ పై తాజాగా బీఎస్పీలో చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్‌ ప్రభావం కనిపిస్తోంది. ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఓ మాజీ ఐపీఎస్.. ఆయనకు ఓ మంచి అధికారిగా పేరున్నా.. ఆయనేమీ మాస్ లీడర్ కాదు. కాకపోతే.. స్వేరో అంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ఆయన కనుసన్నల్లో ఉంది. అందులో లక్షల మంది సభ్యులు ఉన్నారు. అయితే.. కేసీఆర్‌కు ఉన్న ప్రజాదరణతో ఆర్‌ఎస్పీని అసలు ఏమాత్రం పోల్చలేం.


కానీ.. అలాంటి కేసీఆర్ పై కూడా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ ప్రభావం పడింది. తాజాగా హూజూరాబాద్‌లో నిర్వహించిన దళిత బంధు ప్రారంభ సమావేశం ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. దళితులు ఎందుకు వ్యాపారవేత్తలు కాకూడదు.. దళితులు ఎందుకు లక్షలు సంపాదించకూడదు.. దళితులు ఎందుకు ధనవంతులు కాకూడదు అని కేసీఆర్ మాట్లాడుతుంటే.. ఆ ఆరెస్పీనే కేసీఆర్ రూపంలో వచ్చాడా అనిపించింది చాలాసార్లు.. అంతే కాదు.. ఈ దళిత బంధు అమలు కోసం దళిత విద్యార్థినేతలతో.. దళిత రచయితలు, మేధావులు, నాయకులతో కమిటీలు వేయిస్తానని కేసీఆర్ అన్నారు.


కేసీఆర్ చెబుతున్న ఈ దళిత విద్యార్థినేతలు, రచయితలు, మేధావులు ప్రస్తుతం ఆర్‌ఎస్పీ వైపు మొగ్గుతున్నారు. వారిని టీఆర్ఎస్‌ వైపు మల్లించేందుకే కేసీఆర్‌ ఈ కొత్త ఎత్తుగడ వేసినట్టు కనిపిస్తోంది. అంతే కాదు.. తన ప్రసంగంలో చివర్లో ఎన్నడూ లేనిది కేసీఆర్ జైభీమ్ అంటుంటే.. ఆయనపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ ప్రభావం స్పష్టంగా కనిపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: