ఏపీ, తెలంగాణ రెండూ తెలుగు రాష్ట్రాలు.. అనేక విషయాల్లో ఈ రెండింటి మధ్య పోలిక వస్తుంటుంది.. అయితే.. రాష్ట్రాల మధ్యే కాదు. పాలకుల మధ్య కూడా పోలిక వస్తుంది. అయితే.. గతంలో చంద్రబాబు, కేసీఆర్ రెండు రాష్ట్రాలకు సీఎంలుగా ఉన్న సమయంలో కాస్త స్పర్థ వాతావరణం ఉండేది.. అయితే జగన్ సీఎం అయ్యాక.. కాస్త మార్పు వచ్చింది. మొదట్లో జగన్, కేసీఆర్ ఇద్దరూ స్నేహితుల్లా మెసిలారు.. ఆ తర్వాత మాత్రం ఎక్కడో తేడా కొట్టింది. అప్పటి నుంచి కాస్త దూరం దూరంగానే ఉంటున్నారు.


గతంలో బేసిన్లు, బేషజాలు వద్దు అని స్నేహగీతాలు పాడుకున్న వాళ్లే.. ఆ తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్టుగా తయారయ్యారు. అయితే.. అనేక విషయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ది పై చేయిగా ఉంటోంది.. హైదరాబాద్ వంటి ఆర్థిక వనరులన్న నగరం తెలంగాణ సొంతం కావడంతో కేసీఆర్‌కు ఆర్థికంగా వెసులుబాటు ఉంటోంది. దీనికి తోడు జలాల విషయంలో తెలంగాణ పై రాష్ట్రం కావడం ఏపీ కింది రాష్ట్రం కావడం కూడా తెలంగాణకు కలసి వస్తోంది.


ఏపీ సీఎం జగన్ మాత్రం కేసీఆర్‌తో అటు స్నేహం కానీ.. ఇటు జగడం కానీ లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. కానీ.. కేసీఆర్ మాత్రం ఇటీవల ఏమాత్రం అవకాశం వచ్చినా జగన్ సర్కారు తీరును ఎండగడుతున్నారు. ఇందుకు కారణం కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీతో కయ్యం పెట్టుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకోవడమే.. ఇందుకు కారణాలు ఎలా ఉన్నా.. బీజేపీతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా కేసీఆర్ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. బీజేపీ పాలనను తీవ్రంగా ఎండగడుతున్నారు.


బీజేపీని తిట్టే సమయంలో ఒకటో, రెండో తిట్లు ఏపీకి కూడా పడుతున్నాయి. కేంద్రం విద్యుత్  మోటార్లకు మీటర్లు పెట్టమని ఒత్తిడి చేస్తోందంటున్న కేసీఆర్.. ఏపీ అందుకు ఒప్పుకుందని.. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే మీటర్లు పెట్టారని కొన్ని రోజుల క్రితం కేసీఆర్ కామెంట్ చేశారు. ఇక ఇప్పుడు.. తెలంగాణలో చీకట్లు అలముకుంటాయని ప్రచారం చేశారని.. కానీ ఇప్పుడు మనల్ని విమర్శించిన వారి రాష్ట్రంలోనే అంధకారం ఉందని పరోక్షంగా ఏపీని విమర్శించారు కేసీఆర్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: