సీనియర్లు, జూనియర్ల మధ్య ర్యాగింగ్ వివాదం ఉదంతంలో ప్రీతి అనే మెడికో ఆత్మహత్యకు పాల్పడింది. కొత్తగా కాలేజీల్లో అడుగుపెట్టిన వారిని బెదిరించి, భయపెట్టి వారిని హింసించి రాక్షాసనాందం పొందుతున్నారు ఆయా మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివే సీనియర్ విద్యార్థులు. ఇలాంటి సంఘటనలపై లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ఆత్మ పరిశీలన చేసుకునే సమయం వచ్చింది. పెద్ద చదువులు చదవడమే కాదు. కాస్త బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించాల్సిన అవసరం సీనియర్ విద్యార్థులకు ఎంతైనా ఉంది.


ప్రీతి మృతదేహం సాక్షిగా అక్కడి విద్యార్థులు కచ్చితంగా కొన్ని చర్యలు తీసుకోవాల్సిందే. గతంలో మేము ర్యాగింగ్ కు గురయ్యాం. కాబట్టి  మా తర్వాత వచ్చే విద్యార్థులను కూడా ర్యాగ్ చేస్తాం అనే పెడ ధోరణిని విడిచిపెట్టి అందరూ కలిసి మెలిసి ఉండేలా ప్రవర్తన మార్చుకుంటే విద్యార్థి లోకం బాగుపడుతుంది. అంతే కానీ జూనియర్ విద్యార్థులను రాచి రంపన పెడతామనే చర్యలు అస్సలు మంచివి కావు.


వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో పీజీ వైద్య విభాగంలో చదువుతున్న దారవత్ ప్రీతి  మాట్లాడిన ఆడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఆత్మహత్యాయత్నానికి ముందు రోజు ప్రీతి తన తల్లితో మాట్లాడుతూ.. తనతో పాటు చాలా మంది విద్యార్థినులను సైఫ్ వేధిస్తున్నాడని కానీ ఆ బాధలను ఎవరికి చెప్పుకోలేక చాలా మంది తమలో తాము కుమిలిపోతున్నామని తల్లితో వాపోయింది. సైఫ్ ను ఎదిరించినందుకు తనను అందరూ సీనియర్లు కలిసి ఒంటరి చేస్తున్నారని చెప్పింది. అనస్తీషియా విభాగంలోని హెచ్ వోడీకి చెబితే తనకు కాకుండా అధికారికి ఎలా చెప్పావంటూ బెదిరించాడని వాపోయింది.


దీనికి తల్లి బదులిస్తూ నువ్వేం భయపడకు బిడ్డా.. నేను సైఫ్ తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తా అని తల్లి ధైర్యం చెప్పింది. కానీ ఈ లోపే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించింది.  కాలేజీల్లో ర్యాగింగ్ భూతాన్ని కచ్చితంగా తరిమివేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: