
చమురు ధరల పెరుగుదలపై పార్లమెంటులో చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీ రామారావు డిమాండ్ చేశారు. భాజపా ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచి దేశ ప్రజలను నిలువునా దోచుకుంటోందని మంత్రి కేటీఆర్ అన్నారు.
అంతర్జాతీయ ముడిచమురు ధరలను బూచిగా చూపించి కేంద్రం ఇంతకాలం చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. బ్యారెల్ ముడి చమురు ధర 2013లో 110 డాలర్లు ఉన్నప్పుడు, దేశంలో లీటర్ పెట్రోల్ రేటు కేవలం 76 రూపాయలు ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పుడు బ్యారెల్ ముడిచమురు రేటు దాదాపు సగం పడిపోయి 66 డాలర్లకు తగ్గినా, పెట్రోల్ ధర లీటర్ కు 110 రూపాయలు ఉండడమేంటని మంత్రి కేటీఆర్ నిలదీశారు.
దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని, మోదీనేనని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్ అన్నారు. ముడి చమురును బూచిగా చూపి తన కార్పొరేట్ మిత్రుల ఖజానాను లాభాలతో నింపేందుకు మోదీ ప్రభుత్వం పెట్రోల్ ధరను పెంచుకుంటూ పోతున్నదని మంత్రి కేటీఆర్ అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు.