ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 2025 సంవత్సరం 'పెట్టుబడుల నామ సంవత్సరం'గా నిలిచిపోతుంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం సాగించిన ప్రస్థానం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లు జనవరి నుంచి నవంబరు వరకు దేశ విదేశాల్లో జరిపిన పర్యటనలు రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చాయి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ సాధించిన పారిశ్రామిక విజయాల సమగ్ర విశ్లేషణ ఇలా ఉంది.


కీలక సంస్థలు - విశాఖ హబ్ :
విశాఖపట్నం ఐటీ మరియు డేటా హబ్‌గా ఈ ఏడాది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ మరియు టీసీఎస్ కేంద్రాలకు ఈ ఏడాదే పునాది పడింది. వీటి ద్వారా సుమారు లక్ష మంది యువతకు ఉపాధి లభించనుంది. గతంలో నిలిచిపోయిన దుబాయ్‌కు చెందిన లూలూ మాల్ ప్రాజెక్టును ప్రభుత్వం తిరిగి గాడిలో పెట్టింది. ఇది విశాఖ పర్యాటక మరియు వాణిజ్య రంగానికి పెద్ద ఊతం ఇవ్వనుంది.


పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచేందుకు ప్రభుత్వం వినూత్న పారిశ్రామిక విధానాలను అమలు చేసింది. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను నేరుగా అందించేందుకు 'ఎస్క్రో అకౌంట్' సౌకర్యాన్ని కల్పించిన ఏకైన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉన్న సంస్థలను ఆకర్షించేందుకు తక్కువ ధరకే భూములు, విద్యుత్ మరియు పన్ను రాయితీలను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, ఈ ఏడాది ఊహించని మైలురాయిని చేరుకుంది.


రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు:
వివిధ రంగాల్లో (క్వాంటం కంప్యూటింగ్, గ్రీన్ ఎనర్జీ, బ్యాంకింగ్ మొదలైనవి) ఏపీ మొత్తం రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. కేవలం ప్రైవేటు రంగమే కాకుండా, మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టుల నియామకాలతో ప్రభుత్వ రంగంలోనూ ఉద్యోగాల జాతర కొనసాగింది. అమెరికా, సింగపూర్, దుబాయ్ వంటి దేశాల నుంచి దిగ్గజ సంస్థలను రప్పించడంలో ఏపీ ప్రభుత్వం సక్సెస్ అయింది. ప్రతి కేబినెట్ సమావేశంలోనూ పెట్టుబడులే అజెండాగా సాగడం వల్ల, 2025లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సరికొత్త పుంతలు తొక్కింది. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: