రోళ్లు పగిలేలా ఎండలు సాధారణంగా మే చివరిలో దంచికొడతాయి. కానీ  ఈసారి ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గాలిలో  తేమ శాతం కూడా బాగా పడిపోయింది. పొద్దస్తమానం ఫ్యాన్లు నడుస్తున్నా.. కూలర్లు పెట్టుకున్నా.. వేడిగాలితో పాటు ఇంట్లో ఉండలేని .. బయట తిరగలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీనికి గల కారణాలను విశ్లేషిస్తే.. ప్రస్తుత నగరంలో వాతావరణ మార్పులకు కారణం ప్రజల అనాలోచిత నిర్ణయాలే అనే విషయం స్పష్టం అవుతోంది.


కొన్ని దశాబ్ధాల క్రితం విదేశీయులు మన దేశంలో పర్యటించారు. గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వారి జీవితం మొత్తం మన వాతావరణానికి అనుకూలంగా నివాసాలు ఏర్పరుచుకోవడం ఎలా.. అలా చేయడం వల్ల ఎంత విద్యుత్ ఆదా చేయవచ్చు. ప్రకృతికి హాని కలిగించకుండా ఎలా జీవించవచ్చు అనే అంశాలపై అధ్యయనం చేశారు.


ఇలా అధ్యయనం చేసి మన వాతావరణానికి అనుకూల నిర్మాణాలను సూచించారు. ప్రస్తుతం మనం వాడుతున్న సిమెంట్, ఇసుక ఇంత పరిమాణంలో అనవసరం. కానీ హంగులు , ఆర్భాటాల కోసం పెద్ద మొత్తంలో వీటిని వినియోగిస్తున్నాం. దీంతో పాటు పని సులభంగా అవుతుందనే కోణంలోనే మనం ఆలోచిస్తున్నాం కానీ.. ఇంత అవసరమా అని ఆలోచించలేకపోతున్నాం. భారతదేశంలో అన్ని రుతువులు సరి సమానంగా ఉంటాయి. వేసవి కాలంలో సూర్యుడి తాపం తట్టుకోలేనంతగా ఉంటుంది.  శీతాకాలంలో విపరీతమైన చలి, వర్షాకాలంలో ముంచెత్తే వానలు.. ఇలా అన్ని సమానంగా ఉంటాయి.


వీటిని తట్టుకుంటూ.. నిలబడేలా మన పూర్వీకులు చక్కటి పరిష్కారం చూపారు.  భవన నిర్మాణాలకు ఎర్రమట్టి ఇటుకలను ఉపయోగించేవారు. ఇవి అంతర్గతంగా గాలి పోయే వెసులుబాటు ఉంటుంది. అందువల్ల గోడల మీద పడే సూర్యరశ్మి కిరణాలను గ్రహించి.. నీడ రాగానే వాటిని వదిలేస్తాయి. కానీ మనం మూడు నుంచి నాలుగు అంగుళాల మేర ప్లాస్టరింగ్ చేయడం మూలాన.. మన భవనాలు వేడిని గ్రహించినంత సులభంగా విడుదల చేయలేకపోతున్నాయి. దాని ఫలితమే ఇంట్లో వేడి, ఉక్కపోత. దీంతో పాటు ఆకాశ హర్యాలు నిర్మించడం వల్ల ఏసీల వినియోగం పెరిగి వాతావరణం వేడెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: