తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి...తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు..ఏ పార్టీలో ఉన్నా సరే...తనదైన శైలిలో మాట్లాడటం, పనిచేయడం జగ్గారెడ్డి నైజం. తనకంటూ సొంత రాజకీయ శైలిని ఏర్పాటు చేసుకున్నా జగ్గారెడ్డి రాజకీయ జీవితం బీజేపీలో మొదలైంది...మొదట బీజేపీలో కౌన్సిలర్‌గా పనిచేశారు..ఆ తర్వాత సంగారెడ్డి మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు.

ఇక టీఆర్ఎస్ ఆవిర్భావించక...బీజేపీని వదిలి ఆ పార్టీలో చేరిపోయారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అటు వైపు వెళ్ళిపోయారు..2009లో కాంగ్రెస్ నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో విప్‌గా పనిచేశారు. తెలంగాణ వచ్చాక జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే 2014లో మెదక్ పార్లమెంట్ ఉపఎన్నిక రాగా, ఆ ఎన్నికలో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ బీజేపీలో ఉండలేక కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున సంగారెడ్డిలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడుగా ఉన్నారు..పి‌సి‌సి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. అయితే ఈయన రూటే సెపరేట్ అన్నట్లు వెళుతున్నారు. అధికార టీఆర్ఎస్ నేతలతో సఖ్యతగా ఉంటూ, సొంత కాంగ్రెస్ పార్టీ నేతలతో కయ్యం పెట్టుకుంటున్నారు. టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఎప్పుడు ఏదొక రచ్చ పెట్టుకుంటూనే ఉంటున్నారు.

అలాగే రేవంత్‌పై బహిరంగంగా విమర్శలు చేసి హైలైట్ అవుతున్నారు..పార్టీ నిర్ణయాలతో సంబంధం లేకుండా తన సొంతంగా పనులు చేసుకుంటున్నారు. ఇలా డిఫరెంట్‌గా ముందుకెళుతున్న జగ్గారెడ్డి...సంగారెడ్డిలో స్ట్రాంగ్‌గానే ఉన్నారు. అయితే నెక్స్ట్ కాంగ్రెస్‌లోనే పోటీ చేస్తారా? లేక వేరే పార్టీ వైపు వెళ్తారా? అనేది క్లారిటీ లేదు. ఆయన మాత్రం పార్టీ మారేది లేదని అంటున్నారు...కానీ వైఖరి చూస్తే అలా కనిపించడం లేదు. మరి చూడాలి జగ్గారెడ్డి కాంగ్రెస్ నుంచే పోటీ చేసి సంగారెడ్డిలో గెలుస్తారో లేదో.                                                                                                                                                            


మరింత సమాచారం తెలుసుకోండి: