'బాలీవుడ్ లో చాలామంది డ్రగ్స్ బానిసలున్నారు, అందరికీ నార్కోటిక్స్ పరీక్షలు చేయండి' అంటూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. ఇటు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఏదొక కామెంట్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే నటి మాధవి లత కూడా అసలు డ్రగ్స్ లేకుండా సినీ ఇండస్ట్రీలో పార్టీ లు జరగవు అంటూ వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం కన్నడ , తమిళ సినీ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది. ఇప్పటికే కన్నడ సినీ రంగంలో డ్రగ్స్ సంబంధాలపై ప్రముఖులను ఎన్సీబీ ప్రశ్నిస్తున్నది. దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ను బుధవారం విచారించారు. హీరోయిన్ రాగిణికి సమన్లు జారీ చేశారు కూడా. అయితే ఇప్పుడు తాజాగా మరో కన్నడ భామను కూడా అధికారులు ప్రశ్నించనున్నారు.కన్నడ పరిశ్రమలో డ్రగ్ రాకెట్ కేసులో సంజనా గల్రానీ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. తన సహాయకుడు, రాఖీ బ్రదర్ రాహుల్ను విచారణకు హాజరుకావాలంటూ కర్ణాటక సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు పంపించడం కన్నడ సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
అయితే దీనిపై సంజనా స్పందించింది. "మీడియా ప్రతినిధులు నాకు పదే పదే ఫోన్ చేస్తున్నారు. డ్రగ్ రాకెట్ గురించి నన్ను పలు ప్రశ్నలు వేసి సమాచారం కోసం ఆరా తీస్తున్నారు. అందుకే నేను మీడియాకు దూరంగా ఉంటున్నాను. అంతేగానీ భయపడి కాదు. నేను చీప్ పబ్లిసిటీకి దూరం" అంటూ స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు సంజనాకు కూడా సమన్లు జారీ చేశారనే విషయం ఇప్పుడు కన్నడ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.