‘‘నటిగా నాకంటూ ప్రత్యేకంగా ఎలాంటి పరిమితులు లేవు. అన్ని రకాల పాత్రలు పోషించాలని ఉంది. ఏ పాత్ర చేసినా అది వాస్తవికతకు దగ్గరగా.. అందరూ రిలేట్‌ అయ్యేలా ఉండాలనుకుంటా’’ అంది నటి ఫరియా అబ్దుల్లా. ‘జాతిరత్నాలు’ చిత్రంతో చిట్టిగా అందరి మనసుల్ని దోచుకున్న ఆమె..ఇప్పుడు ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’తో (Like Share And Subscribe) అలరించేందుకు సిద్ధమైంది. సంతోష్‌ శోభన్‌ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా నవంబరు 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది ఫరియా.‘‘వినోదంతో నిండిన చక్కటి అడ్వంచర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. 40శాతం సినిమా అడవిలోనే జరుగుతుంది. నేనిందులో వసుధ అనే ట్రావెల్‌ వ్లాగర్‌గా కనిపిస్తా. అంటే వీడియోస్‌ కోసం దేశమంతా తిరిగే పాత్ర ఇది. ఈ ప్రయాణంలోనే హీరోని కలుస్తా. తను కూడా ఓ ట్రావెల్‌ వ్లాగరే. మా ఇరువురి ప్రయాణం కలిశాక కథ వినోదాత్మకంగా మారుతుంది. నా పాత్రలో చాలా మలుపులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. కథలో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది’’.

* ‘‘ఈ సినిమా ప్రయాణంలో నాకెన్నో మర్చిపోలేని జ్ఞాపకాలున్నాయి. జీవితంలో తొలి విదేశీ ప్రయాణం ఈ చిత్రం వల్లే జరిగింది. ఓ పాట చిత్రీకరణ కోసం థాయ్‌లాండ్‌ వెళ్లాము. నా పని నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిందని ఆ క్షణం చాలా సంతోషం అనిపించింది. ఈ చిత్రం కోసం 20రోజులు అడవిలోనే ఉన్నాం. ప్రత్యేకంగా ఓ ఊబిని సృష్టించారు. యాక్షన్‌, చేజింగ్‌ సీన్ల కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది’’.
 

* ‘‘జాతిరత్నాలు’లో నా చిట్టి పాత్రని అందరూ అభిమానించారు. దాంతో ఆ పేరు ఒక ఎమోషన్‌గా మారింది. ఆ చిత్రం నాపై మరింత బాధ్యతను పెంచింది. నటన విషయంలో నాకు పరిమితులు లేవు. యాక్షన్‌, సూపర్‌ నేచురల్‌, సైకో థ్రిల్లర్స్‌.. ఇలా అన్ని పాత్రలు చేయాలని ఉంది. మరో ఐదేళ్లకు పాన్‌ వరల్డ్‌ నాయికగా ఎదగాలని కోరుకుంటున్నా (నవ్వుతూ). అలాగే దర్శకత్వం చేయాలన్న కోరికా ఉంది. దానికి మరో పదేళ్ల సమయం పడుతుంది’’.
 

* ‘‘నేను ప్రస్తుతం తెలుగులో రవితేజతో ‘రావణాసుర’ చేస్తున్నా. తమిళంలో విజయ్‌ ఆంటోనీకి జోడీగా ఓ సినిమాలో నటిస్తున్నా. అలాగే ఒక హిందీ వెబ్‌సిరీస్‌కు సంతకాలు చేశా’’.

మరింత సమాచారం తెలుసుకోండి: