టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మీడియం రేంజ్ హీరోలు నిర్మాతలుగా మారుతూ సినిమాలను నిర్మిస్తున్నారు. కొంతమంది హీరోలు తమ సినిమాలను తామే నిర్మించుకుంటూ ఉండగా మరికొందరు హీరోలు బయట హీరోల సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలైన నాని, విజయ్ దేవరకొండ చిన్న సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నితిన్ కూడా నాని, విజయదేవరకొండ రూట్ లో నిర్మాతగా చిన్న సినిమాలను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. 
 
నితిన్ గతంలోనే నిర్మాతగా ప్రొడక్షన్ లోకి దిగాడు. గతంలో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో ఇష్క్ సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఒక నిర్మాతగా వ్యవహరించాడు. ఆ తరువాత నితిన్ నిర్మాతగా గుండెజారి గల్లంతయ్యిందే, చిన్నదాన నీకోసం, అఖిల్ సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలలో గుండెజారి గల్లంతయ్యిందే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా చిన్నదాన నీకోసం సినిమా బిలో యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. 
 
నితిన్ తన స్నేహితుడైన అక్కినేని అఖిల్ హీరోగా నటించిన అఖిల్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ ఈ సినిమాకు కేవలం 20కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. అఖిల్ సినిమా తరువాత నితిన్ నిర్మాణం జోలికి పోలేదు. నితిన్ చేతిలో ప్రస్తుతం హిందీ సినిమా అంధాదూన్ హక్కులు ఉన్నాయి. 
 
ఒక యువ హీరోతో నితిన్ అంధాధూన్ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో నితిన్ పూర్తి వివరాలను ప్రకటించబోతున్నట్లు సమాచారం. నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాలో నటిస్తున్నాడు. నితిన్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 21వ తేదీ 2020 సంవత్సరం భీష్మ సినిమా విడుదల కాబోతుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: