టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు యువ డైరెక్టర్ పరశురామ్ పెట్ల ల కలయికలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఓవైపు గీతగోవిందం సినిమా సక్సెస్ తో మంచి జోష్ మీద పరశురామ్ ఉండగా, ఇటీవల భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో మూడు భారీ విజయాలను సొంతం చేసుకుని హ్యాట్రిక్ అందుకున్న మహేష్ బాబు కూడా మంచి ఊపులో ఉన్నారు. ఇక తొలిసారిగా వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండటంతో ఈ సర్కారు వారి పాట సినిమా పై టాలీవుడ్ ప్రేక్షకులతోపాటు సూపర్ స్టార్ అభిమానుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. తొలిసారిగా మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, సంస్థలు కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఖర్చుతో దీనిని నిర్మించనున్నాయి.

ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మది ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల మహేష్ జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకాభిమానుల నుండి భారీ స్థాయిలో స్పందన లభించింది. కాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని అతిత్వరలో అమెరికాలో ప్రారంభించేలా ఇప్పటికే యూనిట్ ఏర్పాట్లు చేసింది. అయితే ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ ఉండడంతో దీని షూటింగ్ మరో రెండు నెలల వరకు వాయిదా వేయక తప్పని పరిస్థితులు తలెత్తినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి కరోనా కారణంగా విధించబడిన లాక్ డౌన్ తో ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా నవంబర్ కి వాయిదా పడటం ఇక ఫస్ట్ షెడ్యూల్ చేద్దామనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అమెరికాలో కరోనా కేసులు పెరగడం కారణంగా ఇప్పుడు మరోసారి వాయిదా పడటంతో అసలు మా హీరో సినిమాకే ఎందుకు ఈ విధంగా తలనొప్పులు వస్తున్నాయి అంటూ పలువురు సూపర్ స్టార్ అభిమానులు కొంత నిరాశతో తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మెసేజెస్ చేస్తున్నారు. కాగా అందుతున్న సమాచారాన్ని బట్టి వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి వేగంగా పూర్తి చేసిన అనంతరం వచ్చే ఏడాది సమ్మర్లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అదే కనుక నిజమైతే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది నిజంగా పండుగ వార్తే అని చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: