స్వరాల వేటలో పిహెచ్ డీ చేసిన గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి గాయకుడు మరొకరు లేరు, ఇక రారు. అంతటి కళాప్రపూర్ణ ఇటీవలే కరోనా కారణంగా మనకు దూరం అయిన విషయం తెలిసిందే. వాస్తవానికి భౌతికంగా ఆయన  దూరమయ్యారు, కానీ మానసికంగా ఎప్పుడూ మన మధ్యనే ఉంటాడు. ఆయన పాట వింటే ఆయన రూపం మన ముందు కదలాడుతుంది. పాటలకు తన స్వరంతో ప్రాణం పోసిన బాల సుబ్రహ్మణ్యం గారికి మరణమనేది లేదు. సప్త స్వరాలతో రాగాలు పలికించే తియ్యటి స్వరంతో దశాబ్దాలపాటు వేల పాటలతో చిత్రసీమను పరిపాలించారు బాలు. దాదాపు 40 వేలకు పైగా పాటలు, 16 భారతీయ భాషలు, అన్ని భాషల అగ్ర హీరోలకు గాత్రదానం చేసి ఘన కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్న స్వర్గాధిపతి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు.

అయితే నేడు బాలు 75 వ జయంతి సందర్భంగా ఆ మహా గాయకుడికి ఘన నివాళి తెలిపేందుకు నేడు జూన్ 4 తెలుగు చలన చిత్ర సీమలో స్వరనీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.  నేడు ఉదయం 10 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు ఈ ప్రోగ్రాం ఆన్లైన్లో కొనసాగనుంది. ఈ విషయాన్ని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్  ఆర్ పి పట్నాయక్ సోషల్ మీడియా ద్వారా ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించి బాలు గారికి నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు. అయితే కొన్ని సంవత్సరాలుగా మ్యూజిక్ ని విడిచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆర్ పి పట్నాయక్ బాలు గారి మాట కోసం తిరిగి సినీ పరిశ్రమలోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఇక నేడు ఆన్లైన్ లో జరుగనున్న ఈవెంట్ లో ప్రముఖ గాయనీ గాయకులు, సంగీత దర్శకులు, టాలీవుడ్ ప్రముఖులు. ఇలా బాలుతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధమున్న వారంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోనున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ బాలు పాడిన పాటలను పాడి ఆయన్ని గుర్తు చేసుకుంటూ నివాళి అర్పించపోతున్నారు. మన తరపున కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఘన నివాళి అందిద్దాం. ఆయన ఆత్మ ఈ లోకాన ఉన్నా ప్రశాంతంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: