తన ప్రేమకు అడ్డు వస్తుందని కన్నతల్లిని కూతురే హత్య చేసిన ఘటన ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. హైదరాబాద్ లోని హయత్ నగర్ కు చెందిన కీర్తి తన తల్లి రజితను హత్య చేసిన ఘటనలో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ప్రియుడు శశినే తన తల్లిని చంపాలని ప్లాన్ చేశాడని ఇద్దరం మద్యం సేవించి ఈ హత్య చేసామని పోలీసుల విచారణలో కీర్తి అంగీకరించటం సంచలనం రేకెత్తిస్తోంది.

 


ఈనెల 19న మార్కెట్ కి వెళ్లి ఇంటికొచ్చిన రజితకు ఇంట్లో కూతురు కీర్తి, ఆమె ప్రియుడు శశి సన్నిహితంగా ఉండటం చూసి తీవ్రంగా మందలించింది. ఇదే విషయమై గతంలో కూడా రజిత శశి ఇంట్లో వారించినట్టు తెలుస్తోంది. దీంతో ఆమె అడ్డు తొలగించుకుంటేనే తమ ప్రేమ సఫలమవుతుందని భావించిన శశి ఈ హత్యకు పథకం పన్నాడని కీర్తి పోలీసులకు తెలిపింది. ఇంటి బయట కారులో ఇద్దరూ మద్యం సేవించి ఆ మత్తులో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు కీర్తి పోలీసు విచారణలో తెలిపింది. కీర్తి ఇంట్లో మూడు బీరు బాటిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కీర్తికి బాలి రెడ్డి అనే వ్యక్తితో పెళ్లి చేయాలని పెద్దలు భావించినా ఆమె శశితో కలిసి తిరగడంపై ఆరోజు రజిత కూతురును మందలించి చేయి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని శశితో కీర్తి చెప్పడంతో ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కీర్తి ముందు ఒప్పుకోకపోయినా కీర్తి ఇంట్లో విషయాలు ప్రస్తావించి ఆమెను ఒప్పించాడని విచారణలో తేలింది.

 


హత్య జరిగిన రెండు రోజుల తర్వాత మృతదేహం తరలింపులో జాగ్రత్తలు తీసుకున్నాడు శశి. కారులో రజిత మృతదేహాన్ని తీసుకుని మెయిన్ రోడ్డులో కాకుండా సర్వీసు రోడ్డులో 16 గ్రామాల గూండా రామన్నపేటకు తీసుకెళ్లాడని తెలుస్తోంది. దీంతో ఆయా గ్రామాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. రేపు నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరచనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: