గ్రహాంతరవాసులున్నారా? ఇది ఇప్పటి ప్రశ్నకాదు. దీనిపై అనేక సిద్ధాంతాలు చలామణీలో ఉన్నాయి. చూశామని కొందరు చెప్తుంటే, అలాంటి ఛాన్సే లేదని మరికొందరు కొట్టిపారేస్తుంటారు.

అయితే తాజాగా ఇజ్రాయెల్ అంతరిక్ష భదత్ర మాజీ చీఫ్ హేమ్ ఇషెద్ ఓ బాంబు పేల్చారు. ఏలియన్స్ నిజంగానే ఉన్నాయని ప్రకటించటమే కాదు..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కూడా ఆ నిజం తెలుసని సంచలన కామెంట్స్‌ చేశారు. గ్రహాంతరవాసులను అంగీకరించేందుకు ప్రపంచం ఇప్పుడే సిద్ధంగా లేనందున అమెరికా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతోందంటున్నారు.

87ఏళ్ల ఇషెద్..చిన్నా చితకా వ్యక్తి కాదు.. ఇజ్రాయెల్ స్పేస్ సెక్యూరిటీకి దాదాపు మూడు దశాబ్దాల పాటు చీఫ్‌ గా పనిచేశారు. ఏలియన్స్ ఉంటారనే కాదు.. వాటి గెలాక్సీ సమాఖ్యకు, అమెరికా ప్రభుత్వానికి మధ్య ఓ ఒప్పందం కూడా ఉందని ఆయన అంటున్నారు. విశ్వం రహస్యాలపై పరిశోధనలు చేసేందుకు యూఎస్ వ్యోమగాములు.. గ్రహాంతరవాసులతో ఈ ఒప్పందం చేసుకున్నారని చెబుతున్నారు.

అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ కు కూడా అన్ని విషయాలు తెలిసినా, ప్రజలు కంగారుపడతారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని బయటకు వెల్లడించడం లేదని చెప్పారు. అంతరిక్షం, స్పేస్‌ షిప్‌ ల గురించి మానవులకు పూర్తిగా అర్థమైన తర్వాతే తమ అస్థిత్వం గురించి బయటపెట్టాలని ఏలియన్స్ అమెరికాకు చెప్పారని ఆయన అంటున్నారు.

అయితే ఇన్ని తెలిసిన వాడు ఈ విషయాన్ని  ఇంతకాలం ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నిస్తే, గతంలో దీనిపై నోరు విప్పితే ఈ పాటికి ఆస్పత్రిలో ఉండేవాణ్నని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై ఆయన రాసి ది యూనివర్స్ బియాండ్ ది హారిజన్లోనూ ఈ విషయాలను ప్రస్తావించారు. అయితే ఇజ్రాయెల్ శాస్త్రవేత్త వ్యాఖ్యలపై అటు అమెరికా ప్రభుత్వం గానీ.. డొనాల్డ్ ట్రంప్‌ కానీ ఇంతవరకూ స్పందించలేదు.

మరోపక్క ఈ మధ్య ప్రపంచంలో పలు చోట్ల లోహ స్తంభాలు పాతి ఉండటం.. అది అకస్మాత్తుగా మాయం కావటం కూడా సంచలనంగా మారుతోంది. అమెరికా రెడ్ రాక్ ఎడారిలో, ఆ తర్వాత రొమానియాలోని ఓ హెరిటేజ్ సైట్స్ లో త్రిభుజాకార లోహ స్తంభం కనిపించటం చర్చనీయాంశంగా మారింది. ఇది గ్రహాంతరవాసుల పనేనని కొందరి అనుమానం.

నిజానికి గ్రహాంతర వాసుల కథలు ఇప్పటివి కావు. అనేక చోట్ల యూఎఫ్ వో లు ఎగురుతుండగా చూశామని చాలామంది చెప్తుంటారు. గాల్లో వింత ఆకారాలను షూట్ చేసిన వీడియోలు కూడా వైరల్‌ అవుతుంటాయి. గ్రహాంతర వాసుల కథలతో అనేక సినిమాలు కూడా హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ గా వచ్చాయి. ఏరియా 51 అనే ప్రాంతంలో అమెరికా సైన్యం గ్రహాంతరవాసులను బంధించి పెట్టిందని, వాళ్ల నుంచే అధునాతన టెక్నాలజీని ఆ దేశం పొందుతోందనే ఆరోపణలు కూడా ఏన్నో ఏళ్లుగా ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్‌ సైంటిస్ట్‌ ప్రకటన సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: