ఇప్పుడు భారత్ సైన్యం అమ్ముల పొదిలోకి కొత్త అస్త్రాలు వచ్చి చేరాయి. తాజా భారత్ డ్రోన్ల తయారీలో కీలక ముందడుగు వేసింది. అదే స్వార్మ్ టెక్నాలజీ.. ఇదే డ్రోన్ టెక్నాలజీ.. దీని ద్వారా భారత్ తన శత్రువులపై మన భూభాగం నుంచే విరుచుకుపడొచ్చు. పదుల సంఖ్యలో ఉండే డ్రోన్ల ద్వారా శత్రువుల ట్యాంకులు, శత్రు స్థావరాలు, ఉగ్రక్యాంపులు, హెలీప్యాడ్లు, ఇంధన నిల్వలపై ఒక్కసారిగా దాడి చేయొచ్చు. ఉరుముల్లేని పిడుగుల్లా విరుచుకుపడి విధ్వంసం చేయొచ్చు.
భారత్ ఇటీవల అభివృద్ధి చేసిన ఈ స్మార్మ్ టెక్నాలజీని.. 75 డ్రోన్లతో ప్రదర్శించింది. ఇవి వాటంతటవే లక్ష్యాలను గుర్తించి ధ్వంసం చేసే సత్తా ఉన్నవి. ఈ టెక్నాలజీని మన దేశం ప్రైవేటు కంపెనీలతో కలిసి భారత్ అభివృద్ధి చేసింది. భారత్ ఇప్పటికే ఏకంగా 48 వేల కోట్ల రూపాయల వ్యయంతో తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని ఇటీవల నిర్ణయించింది. దీని ద్వారా దేశీయ తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ఎంకే1ఏ రకం కొనుగోలు జరుగుతుంది. ఈ ఒప్పందం కారణంగా మరో 83 విమానాలు భారత్ అమ్ములపొదిలో చేరతాయి.
తేజస్ కు ప్రపంచంలోనే అత్యుత్తమైందన్న పేరుంది. తొలితరం తేజస్తో పోలిస్తే ఎంకే1ఏ రకంలో చాలా మార్పులు చేస్తారు. ఇప్పటికే వాయుసేనలో ఉన్న తేజస్ ఎంకే1 ఎఫ్వోసీకి ఇది అడ్వాన్స్ మోడల్ అని చెప్పొచ్చు. దీనిలో క్వాడ్రప్లక్స్ డిజిటల్ ఫ్లైబైవైర్ వ్యవస్థను వినియోగించారు. విమానం బరువు తగ్గించేందుకు తయారీలో ప్రత్యేక మిశ్రమ లోహాలను వినియోగించారు. వీటి వల్ల విమానం గడువు కూడా పెరుగుతుంది.