తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య, ఆరోగ్యశాఖపై ప్రత్యేక దృష్టి సారించడం కొవిడ్ రోగులకు బాగా కలిసొస్తోంది. కరోనాను పూర్తిగా నియంత్రించి దేశానికే ఆదర్శంగా నిలవాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్న కేసీఆర్ ఆ బాధ్యతలను మంత్రి హరీష్రావుకు అప్పజెప్పడంతోపాటు తాను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.ఇప్పటికే సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేయించాలనే నిర్ణయంతోపాటు 18 సంవత్సరాలు నిండినవారికి కూడా టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని ఫార్మా కంపెనీలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రాష్ట్రానికి అవసరమైన ఔషధాల కొరత లేకుండా చూస్తుండటం కూడా కొవిడ్ బాధితులకు ఒక వరంగా మారింది.
ఏమిటీ సూత్ర?
‘సూత్ర’ అనేది ఒక మ్యాథమెటికల్ మోడల్. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి.. క్షీణతలు, మరణాల హెచ్చుతగ్గులపై సూత్ర అనే ఒక మ్యాథమెటికల్ మోడల్ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఐఐటీ కాన్పూర్కు చెందిన ఎం అగర్వాల్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ కు చెందిన ఎం కనిట్కర్, ఐఐటీ హైదరాబాద్కు చెందిన ఎం విద్యాసాగర్ ససెప్టిబుల్, అన్డిటెక్టెడ్, టెస్టెడ్, రిమూవ్డ్ అప్రోచ్ల సంక్షిప్త నామంగా సూత్ర అంటున్నారు. కరోనా కేసులు.. లక్షణాలున్నవారు.. లేనివారు, రోజూవారీ కేసుల సరళి.. వాప్తి తీవ్రతను.. కొవిడ్19 పై ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో పొందుపరచిన సమాచారం ఆధారంగా అధ్యయనం చేశారు. దీని ప్రకారం జూన్ మొదటివారానికి తెలంగాణలో రోజూవారి కేసులు వెయ్యికి పడిపోతాయని, నెలాఖరుకు రోజూవారీ కొత్త కేసులు 90 శాతం పడిపోతాయని నిర్ధారించారు. ఆశ్చర్యమేమిటంటే.. ఐఐటీ కాన్పూర్ సూత్ర మోడల్తో వేసిన గణాంకాలు.. సింగపూర్ యూనివర్సిటీ భారత్తో సహా 131 దేశాల్లో చేసిన సర్వే, పరిశోధనల గణాంకాలతో అతి దగ్గరగా ఉన్నాయి.
తెలంగాణలో తగ్గిన పాజిటివిటీ రేటు?
తెలంగాణలో ఇప్పటికే కొత్త కేసులు రావడం తగ్గిపోయింది. పాజిటివిటీరేటు సైతం ఐదు శాతం దిగువకు పడిపోయింది. మరణాల సంఖ్య తగ్గుతోంది. రెండోదశ ఉధృతి మొదలైన దాదాపు నెలరోజుల్లోనే అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరంచెల వ్యూహాన్ని అమలుచేసింది.ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు గణితశాస్త్ర సిద్ధాంతపరంగా అభివృద్ధిచేసిన ‘సూత్ర’ ప్రకారం జూన్ చివరికల్లా దేశంలోనే కరోనా క్షీణిస్తుందని, తెలంగాణలో మే నెలాఖరుకే రోజూవారి కొత్త కేసుల్లో 90 శాతం క్షీణత కనిపిస్తుందని తేల్చింది.