ఎన్నికలహీట్ పెరిగేకొద్దీ కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక దాదాపు ఫైనల్ అవుతున్నట్లే ఉంది. ఇలాంటి నియోజకవర్గాల్లో విశాఖపట్నం పార్లమెంటు సీటు ముందువరసలో ఉంది. ఇప్పటి పరిస్ధితులను బట్టిచూస్తే మూడుపార్టీల తరపునా నాన్ లోకల్ అభ్యర్ధులు దాదాపు ఫైనల్ అయినట్లే. ఎందుకంటే వీళ్ళంతా ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు కాబట్టే. మొదటినుండి విశాఖలో నాన్ లోకల్స్ హవానే బాగా నడుస్తోంది. ఇదే విషయమై జనాలు ఎంతగా మొత్తుకుంటున్నా పార్టీలు మాత్రం పట్టించుకోవటంలేదు.





ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో వైజాగ్ పార్లమెంటుకు టీడీపీ తరపున భరత్ పోటీచేయబోతున్నారట. పోయిన ఎన్నికల్లో కూడా భరత్ పోటీచేసి ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీగా తానే పోటీచేయబోతున్నట్లు ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేసేసుకుంటున్నారు. నియోజకవర్గాలవారీగా నేతలతో సమావేశాలు కూడా పెట్టుకుంటున్నారు. ఇదంతా చూసిన తర్వాత టీడీపీ తరపున భరతే అభ్యర్ధిగా ఉంటారనే అందరు అనుకుంటున్నారు.





ఇక బీజేపీ తరపున జీవీఎల్ నరసింహారావు పోటీచేయటం దాదాపు ఖాయమైపోయింది. ఈయన వైజాగ్ లోనే క్యాంపాఫీసును ఏర్పాటు చేసుకుని వ్యవహారాలన్నీ నడుపుతున్నారు. బీజేపీ తరపున జీవీఎల్లే అభ్యర్ధిగా దిగబోతున్నట్లు పార్టీలోనే బాగా చర్చ జరుగుతోంది. అలాగే వచ్చేఎన్నికల్లో తాను విశాఖ ఎంపీగా పోటీచేయబోతున్నట్లు స్వయంగా వీవీ లక్ష్మీనారాయణే ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసి ఓడిపోయారు. ఇక వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణే పోటీచేస్తారా లేదా అన్నది సస్పెన్సుగా మారింది.





ఇక్కడ విషయం ఏమిటంటే సిట్టింగ్ ఎంపీ, జేడీగా పాపులరైన లక్ష్మీనారాయణ, జీవీఎల్, భరత్ ఎవరూ లోకల్స్ కారు. సిట్టింగ్ ఎంపీది రాజమండ్రి. లక్ష్మీనారాయణది కర్నూలు జిల్లా. జీవీఎల్ ది ప్రకాశం జిల్లా. భరత్ ఇక్కడే పుట్టి పెరిగినా తాత ఎంవీవీఎస్ మూర్తి కృష్ణాజిల్లా నుండి వెళ్ళి వైజాగ్ లో స్ధిరపడ్డారట. గతంలో ఎంపీలుగా పనిచేసిన టి సుబ్బరామిరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డిది నెల్లూరుజిల్లా. దగ్గుబాటి పురందేశ్వరిది కృష్ణాజిల్లా. మొత్తానికి విశాఖ పార్లమెంటు నాన్ లోకల్స్ కే బాగా అచ్చొచ్చిందేమో.




మరింత సమాచారం తెలుసుకోండి: