తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని తిరుగుబాటు చేశారా ? తాజాగా ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే అలాగే అనుమానంగా ఉంది. వచ్చేఎన్నికల్లో తనకు చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే ఏమవుతుంది ? అని మద్దతుదారులను  ప్రశ్నించారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 265 గ్రామాలను దత్తత తీసుకుని తాను అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు చెప్పారు. తనను కాదని చంద్రబాబు ఇంకెవరికి టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు.





చిత్తశుద్దితో గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తున్న తాను ఇండిపెండెంటుగా పోటీచేసినా జనాలు గెలిపించుకుంటారు అని అన్నారు. పోటీచేయాలంటే తనకు టీడీపీ టికెట్టే అవసరం లేదని కూడా చెప్పారు. చాలామందిలాగ తాను ఫౌండేషన్లని, ట్రస్టులని పెట్టి జనాలను మోసం చేయటంలేదన్న విషయం జనాలందరికీ తెలుసన్నారు. వచ్చేఎన్నికల్లో తాను పోటీచేయటం ఖాయమని ఎంపీ తేల్చిచెప్పేశారు. తనకు టికెట్టు ఇవ్వాలా వద్దా అన్న విషయాన్ని చంద్రబాబే తేల్చుకోవాలని వార్నింగుతో కూడిన సూచన చేయటం ఇపుడు పార్టీలో సంచలనంగా మారింది.





చాలాకాలంగా కేశినేని పార్టీపై గట్టిగానే మాట్లాడుతున్నారు. పదేపదే చంద్రబాబు వైఖరిని నేరుగానే తప్పుపడుతున్నారు. పార్టీలోనే ఉంటు తన వైఖరిని ఎంపీ తప్పుపట్టడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. అయినా ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఎవరిపైనా చర్యలు తీసుకునేంత ధైర్యం చంద్రబాబుకు లేదు. దీన్ని అలుసుగా తీసుకుని ఎంపీతో పాటు ఇంకా చాలామంది పదేపదే మీడియా ముందే నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు.






మొదటినుండి పార్టీలో ఎంపీకి మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, మాజీ ఎంఎల్సీ బుద్ధా వెంకన్నతో పాటు సీనియర్ నేత నాగూల్ మీరాకు ఏమాత్రం పడదు. వీళ్ళమధ్య గొడవల్లో పార్టీ పరువు చాలాసార్లు రోడ్డున పడిపోయింది. అయినా చంద్రబాబు ఎవరినీ ఏమీ అనలేని పరిస్ధితిలో ఉన్నారు. రెండువర్గాలకు నచ్చచెప్పేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. వ్యక్తిగతంగా తనతో పాటు పార్టీకి  సమస్యగా మారిన నానికి వచ్చేఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందుకనే నానీకి పోటీగా తమ్ముడు చిన్నీని ప్రోత్పహిస్తున్నారు. అప్పటినుండే ఎంపీ మరింతగా రెచ్చిపోతున్నారు. చివరకు పార్టీపైనే తిరుగుబాటు లేవదీసేంతగా ముదిరిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: