జగన్మోహన్ రెడ్డి చాలాకాలంగా వైనాట్ 175 ? అనే ప్రశ్న వేస్తున్నారు. పార్టీ మీటింగుల్లో, క్యాబినెట్ సమావేశాల్లో కూడా 175కి 175 సీట్లూ వైసీపీ ఎందుకు గెలవకూడదని పదేపదే అడుగుతున్నారు. అయితే తాజాగా వెల్లడైన ఒక సర్వే రిపోర్టులో జగన్ మాటలు నిజమవుతాయని తేలిందట. టైమ్స్ నౌ-ఈటీజీ సర్వేలో ఈ విషయం బయటపడింది. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి దేశంలోని జనాభా మూడ్ ఎలాగుందనే విషయమై పై రెండు సంస్ధలు దేశవ్యాప్తంగా సర్వే చేశాయట.





ఆ సర్వేలో భాగంగానే ఏపీలో వైసీపీ 24 లేదా 25 పార్లమెంటు సీట్లను గెలుచుకుంటుందని తేలిందట. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన సర్వే ప్రకారం జనాలంతా వైసీపీకి జిందాబాద్ కొట్టారట. దీనికి కారణం ఏమిటంటే జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలేనట. పథకాల అమలులో అవినీతికి అవకాశం లేకపోవటంతో సంక్షేమఫలాలన్నీ జనాలకు కచ్చితంగా చేరుతున్నాయట. అందుకనే 90 శాతం జనాలు జగన్ ప్రభుత్వంపై పూర్తి సంతృప్తి వ్యక్తంచేస్తున్నట్లు సర్వేలో తేలిందట.





24 పార్లమెంటు స్ధానాల్లో వైసీపీ గెలుపంటే మామూలు విషయంకాదు. 22 పార్లమెంటు స్ధానాల్లో గెలుపుతోనే వైసీపీ 151 అసెంబ్లీలను గెలుచుకున్నది. అలాంటిది మిగిలిన 2 లేదా మూడు పార్లమెంటు సీట్లు కూడా గెలుచుకుంటుందంటే ఎన్ని అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుంది ? అంటే తాజా సర్వే రిపోర్టుని బట్టిచూస్తే ప్రతిపక్షాలకు ముఖ్యంగా తెలుగుదేశంపార్టీ గెలిచే పార్లమెంటు సీట్లే ఉండవని అర్ధమవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సర్వేలన్నీ నిజాలే అవుతాయని నమ్మేందుకు లేదు.





ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ సర్వే ఎంతవరకు కరెక్టో తెలీదు. ఎందుకంటే జగన్ ప్రభుత్వంపై కొన్ని సెక్షన్లలో వ్యతిరేకత కనబడుతోంది. 2019 ఎన్నికలకు ముందు జగన్ కున్న సానుకూలత లేదనే అనిపిస్తోంది. పైగా మంత్రులు, ఎంఎల్ఏలపై వ్యతిరేకత కనబడుతోంది. ఈ పరిస్ధితుల్లో 24 లేదా 25 పార్లమెంట్లు గెలుస్తుందంటే నమ్మేందుకు కష్టంగా ఉంది.  ఏ పార్టీకి కూడా ఇలాంటి గెలుపు ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. చట్టసభల్లో  బలమైన ప్రతిపక్షం ఉన్నపుడే ప్రభుత్వంలో జవాబుదారీతనం ఉంటుంది. అధికారపార్టీకి స్పీడు బ్రేకులు లేకపోతే ప్రభుత్వాన్ని అడ్డుకునేదెవరు ? కాబట్టి సర్వేలో తేలినట్లు రిజల్టు రాకూడదని కోరుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: