వివేకానందరెడ్డి మర్డర్ కేసులో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్ధితి వస్తోందా ? అవుననే అనుకుంటున్నారు. ఇందుకు సీబీఐ దాఖలుచేసిన అఫిడవిట్టే కారణం. అఫిడవిట్ ప్రకారం వివేకా చనిపోయారన్న విషయం జగన్ కు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలోనే తెలుసని సీబీఐ ఆరోపించింది. పీఏ కృష్ణారెడ్డి ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్ళినపుడు వివేకా చనిపోయిన విషయాన్ని గుర్తించారు. పీఏ చెబితేనే ప్రపంచానికంతా తెలిసిందని ఇప్పటివరకు అందరు అనుకుంటున్నది.





కడప ఎంపీ అవినాష్ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను జమ్మలమడుగు వెళుతున్నపుడు ఫోన్ చేసి వివేకా హత్యగురించి చెప్పారనే చెబుతున్నారు. అలాంటిది తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలోనే వివేకా చనిపోయిన విషయం జగన్ కు ఎవరు చెప్పారు ? అన్నది కీలకమైంది. వివేకా చనిపోయిన విషయం తనకు ఎవరు చెప్పారనే విషయాన్ని జగన్ బయటపెట్టాల్సిన సమయం వచ్చింది. అయితే ఈ ఆరోపణలను వైసీపీ కొట్టిపారేస్తోంది.





చాలాకాలంగా చంద్రబాబునాయుడుతో సహా తమ్ముళ్ళంతా ఆరోపిస్తున్న విషయాన్నే ఇపుడు అఫిడవిట్ రూపంలో సీబీఐ చెప్పిందంతే అంటున్నారు. ఇదే విషయమై సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతు వివేకా హత్య కేసులో జగన్ కు ముందే సమాచారం ఉందన్న సీబీఐ వాదన, అఫిడవిట్ దాఖలు చేయటం పిల్లచేష్టలుగా ఉందన్నారు. హత్యకేసులో అసలు ఎంపీ అవినాష్ కే సంబంధంలేదని మొత్తుకుంటుంటే ఇపుడు జగన్ కు సమాచారం ఉందని చెప్పటంలో అర్ధమేలేదన్నారు.






ఇదే సమయంలో రాజమండ్రిలో సమావేశమైన టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం వివేకా హత్యను జగనే చేయించారని ముద్ర వేసేసింది. వివేకా హత్య సమాచారం ముందుగా జగన్ కే తెలిసిందని సీబీఐ ఆరోపిస్తున్నది. ఇదే సమయంలో అసలు హత్యచేయించిందే జగన్ అని టీడీపీ ముద్రవేసేసింది. తాము చాలాకాలంగా చెబుతున్నదాన్నే ఇపుడు సీబీఐ అఫిడవిట్ రూపంలో చెప్పిందని సమర్ధించుకుంటున్నది. అందుకనే చంద్రబాబు అండ్ కో చేస్తున్న ఆరోపణలనే సీబీఐ అఫిడవిట్ రూపంలో ఇచ్చిందే కానీ ఇందులో సాక్ష్యాలు, కొత్తవేమి ఉన్నాయని సజ్జల ఎదురుదాడిచేశారు. ఏదేమైనా అఫిడవిట్లో తన  ప్రస్తావన వచ్చింది కాబట్టి  ఇపుడు జగన్ సమాధానం చెప్పుకోక తప్పదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: