ఏపీలో గత ఆరు నెలలుగా ఎంతో ఉత్కంఠ రేపుతూ వచ్చిన సాధారణ ఎన్నికలు ఈ రోజుతో ముగిశాయి. ఓటర్లు అంచనాలకు మించి రాత్రి 9 గంటల వరకు కూడా క్యూలో ఉండి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో అంతిమంగా ప్రజల తీర్పు ఎలా ఉంటుందో గాని ఓటర్లు మాత్రం ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోటెత్తారు. పోలింగ్ తర్వాత అంచనాలను బట్టి అధికార టిడిపికి చెందిన కొందరు కీలక నేతలు ఓడిపోతున్నట్టు పోలింగ్ సరళి చెబుతోంది.
టీడీపీ నుంచి ఓడిపోతున్న ప్రముఖుల్లో మంత్రుల నుంచి కీలక పదవిల్లో ఉన్న వారు వరకు ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. గుంటూరు జిల్లాలో ఓ మంత్రి ఓటమి దాదాపు ఖాయమైనట్టే అని ఆ నియోజకవర్గంలో పోలింగ్ సరళిని బట్టి జోరుగా చర్చ నడుస్తోంది. గత రెండు ఎన్నికల్లోనూ స్వల్ప తేడాతో గెలుస్తూ వస్తున్న ఆయన ఈసారి ఓటమిని తప్పించుకోలేరు అంటున్నారు. అదే జిల్లాలో పోటీ చేస్తున్న మరో సీనియర్ నేత (ఓ కీలక పదవిలో ఉన్నారు) ఓటమి అంచుల్లో ఉన్నట్లు టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే జిల్లాలో పోటీ చేసిన మరి కొందరు సీనియర్లు గెలుస్తారని చెబుతున్న ఆ సీనియర్ మాత్రం బాగా వెనకబడి పోయినట్టు టీడీపీ వర్గాల టాక్.
ఇక రాయలసీమ జిల్లాల్లో ఎంపీగా పోటీ చేస్తున్న మరో మంత్రి చిత్తు చిత్తుగా ఓడిపోతారని స్పష్టంగా తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో ఓ మంత్రి ఓటమి దాదాపు ఖాయమైపోయింది. మరో మంత్రి సైతం అదే బాటలో ఉన్నారు. మరో మంత్రికి మాత్రం కాస్త ఆశలు ఉన్నాయి. సీమ జిల్లాల్లో ఇద్దరి మాజీ మంత్రులు సైతం ఓటమి బాట లోనే ఉన్నారు. కర్నూలులో ఓ కీలక నేత ఓటమికి ఎదురీదుతోంది. నెల్లూరు జిల్లాలోనూ ఓ మంత్రికి బ్యాడ్ రిపోర్టులే వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఓ మంత్రి జీవితంలో ఎన్నడూ లేనంత గట్టి పోటీ ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. ఆయన ఈ సారి చిత్తు చిత్తుగా ఓడతాడన్న రిపోర్టులు రావడంతో వైసీపీ వర్గాలు ఫుల్ జోష్లో ఉన్నాయి.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి ఓడిపోతానని తెలిసి కులం కార్డును నమ్ముకున్నా గెలిచే పరిస్థితి లేదంటున్నారు. తూర్పులో గత రెండు ఎన్నికల్లోనూ ఓ మంత్రి నియోజకవర్గంలో టీడీపీ చిత్తుగా ఓడుతుంటే ఈ సారి మరింత చిత్తుగా ఓడుతోంది. ఏదేమైనా ఈ ఎన్నికల్లో అధికార టీడీపీకి చెందిన పలువురు మంత్రులు, కీలక నేతలు ఓడిపోవడం గ్యారెంటీయే.