తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గురించి ప్రతిపక్షాలు కొత్ విమర్శలు మొదలుపెట్టాయి. కేసీఆర్ ప్రవచిస్తున్న ఫెడరల్ ప్రంట్ ఆచరణలో అయ్యే పని కాదని మరోమారు స్పష్టమైందని అంటున్నారు. ఇందుకు తాజా పరిణామాలను ఉదాహరణగా పేర్కొంటూ కేసీఆర్పై కామెంట్లు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే అధినేత స్టాలిన్, కర్ణాటక సీఎం కుమారస్వామి, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ తదితర నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయి కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు.
ఈ సమావేశాల అనంతరం దేశవ్యాప్తంగా ఎన్నికలు పూర్తయిన తరువాత మరోసారి అన్ని రాష్ట్రాలు తిరిగి అందరితో చర్చిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎన్నికలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో తన పర్యటన మళ్లీ మొదలు పెట్టారు. ముందుగా ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఈ దఫా కేసీఆర్ తన పర్యటనను కేరళ రాష్ట్రం నుంచే ప్రారంభించారు. ఈనెల 13న చెన్నైలో డీ ఎంకే అధ్యక్షులు ఎంకె స్టాలిన్తో సీఎం కేసీఆర్ భేటీ అవుతారని వెల్లడించారు. అయితే, కేరళ సీఎంతో భేటీ అయిన కేసీఆర్కు తమిళనాడు పర్యటనలో ఊహించని అనుభవం ఎదురైంది.
తమిళనాడు విపక్ష నేత స్టాలిన్తో భేటీ కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తుండగా...స్టాలిన్ ఇప్పటివరకు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో తొలిరోజు గురువారం విఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం సమాధిని సందర్శించారు. రెండోరోజు రామేశ్వరం ఆలయాన్ని సందర్శించారు. తన సతీమణి, తనయుడు కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, మనుమడు హిమన్షుతో కలిసి దనుష్కోటి, రామసేతు, పంచముఖి హనుమాన్ దేవాలయాలను కేసీఆర్ సందర్శించుకున్నారు.అయితే, 13వ తేదీన సమావేశం కావాల్సిన స్టాలిన్ మాత్రం ఇప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం చూస్తుంటే...కేసీఆర్కు ఏందీ ఎదురుచూపులు అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.