సీఎం జగన్ ఈనాడు వార్తకు స్పందించారు. ఓ చిన్నారికి సాయం అందించారు. కళ్లకు క్యాన్సర్ సోకి కనుచూపు కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఓ పాప గురించి ఈనాడు పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఈ మానవీయ కథనం అందరినీ కదిలించింది. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు పత్రికల్లో వచ్చిన ప్రముఖ వార్తలను సీఎం దృష్టికి తీసుకెళ్తుంటారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. అందులో భాగంగా ఈ పాప గురించి తెలుసుకున్న జగన్ వెంటనే స్పందించారు.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన చిన్నారి హేమ అనారోగ్యంపై సీఎం వైయస్ జగన్ ఆరా తీశారు. చిన్నారి కుటుంబంతో మాట్లాడి, వైద్యం కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. ఇలాంటి నిరుపేదలను పూర్తిస్థాయిలో ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలు తీసుకురావడానికి గతంలోనే నిర్ణయం తీసుకున్నామని సీఎం వెల్లడించారు.
క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని విడతలు చికిత్స అవసరమైనా చేయించాలని సీఎం స్పష్టం చేశారు. చికిత్సలో ఎన్ని సైకిల్స్ అవసరమైనా పూర్తి ట్రీట్మెంట్ అందిస్తున్నామని పేర్కొన్నారు. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తోందని.. అత్యవసర కేసులు ఉంటే.. ఆ రోగులకు వెంటనే చికిత్సలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. గతంలో మాదిరిగా కాకుండా ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ రోగులకు ఏ పరిమితి లేకుండా చికిత్స అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
కళ్లకు క్యాన్సర్ సోకిన చిన్నారి హేమ అనారోగ్యంపై పత్రికల్లో వచ్చిన కథనంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి స్పందించిన తీరు ప్రశంసనీయంగా ఉంది. జగన్ గతంలోనూ ఇలాంటి కథనాలుపై వెంటనే స్పందించారు. పలువురికి సాయం అందించారు. ఏదేమైనా చిన్నారి హేమ వంటి వారికి ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలి. మానవత్వం చాటుకోవాలి.