కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ తెలంగాణ సీఎం కేసీఆర్...మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఎప్పుడైతే కరోనా ప్రభావం మొదలైందో, అప్పటి నుంచే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం కంటే ముందే తెలంగాణలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. జనతా కర్ఫ్యూ అయిన దగ్గర నుంచి తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది.
ఇక ఇప్పుడు ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే తర్వాత పరిస్థితులని బట్టి దశల వారీగా లాక్ డౌన్ తీసేస్తామని చెప్పారు. అలాగే వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రైతులకు నష్టం రాకుండా చూసుకుంటామని చెప్పారు. అలాగే లాక్ డౌన్ వల్ల పేద ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని అన్నారు.
ఇదే సమయంలో కరోనా పై పోరాటం చేయడంలో భాగంగా లాక్ డౌన్ పొడిగించిన కేసీఆర్, మరొక సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పటివరకు ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు తెచ్చుకునేందుకు ఎక్కువ సమయం ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు తమకు కావాల్సినవి తెచ్చుకునేందుకు సమయం ఇచ్చారు. అయితే ఎక్కువ శాతం ప్రజలు ఈ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సమయం ఉందికదా అని రోజంతా తిరిగే పనిలో ఉంటున్నారు.
ముఖ్యంగా హైదరాబార్ నగర ప్రాంతంలో రోడ్ల మీదకు వేల వాహనాలు వచ్చేస్తున్నాయి. అలాగే కొందరు 3 కిలోమీటర్ల పరిధి దాటేసి తిరుగుతున్నారు. దీంతో వారికి అడ్డుకట్ట వేసేందుకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు తెచ్చుకునే సమయం కుదించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రజలు తిరిగే అవకాశం ఇచ్చారు. అలాగే మిగతా సమయాల్లో షాపులు కూడా క్లోజ్ కానున్నాయి. మొత్తానికైతే కరోనా వ్యాప్తి అరికట్టడంలో కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి