దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. అయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో కార్పొరేట్ ఆస్పత్రులు మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్నాయి. రోగుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ సర్కార్ అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులకు షాక్ ఇచ్చింది.
 
కరోనా వేళ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. తాజాగా మరో మూడు కార్పొరేట్ ఆసుపత్రులకు కరోనా సేవలను కట్ చేసింది. హైదరాబాద్ లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న మరికొన్ని ఆస్పత్రులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం తాజాగా ఐసీయూలో రోగికి 10,000 రూపాయలు కంటే ఎక్కువ వసూలు చేయకూడదని షరతు విధించింది.
 
ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు ఐసీయూలో రోగికి రోజుకు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. వైద్యశాఖ వాట్సాప్‌కు రోజూ పదుల సంఖ్యలో కరోనా రోగుల నుంచి, వాళ్ల కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పలు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ సర్కార్ తప్పు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
 
అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తోందన్న ఆరోపణలతో దక్కన్‌ ఆసుపత్రిలో కరోనా వైద్యం నిలిపివేయాలని తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తాజాగా గచ్చిబౌలిలోని మరో ఆసుపత్రిపై చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గత రెండు రోజులుగా రాష్ట్రంలో తక్కువ కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో సోమవారం 1,286 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 68,946కు చేరింది

మరింత సమాచారం తెలుసుకోండి: