పుల్వామా ఉగ్రదాడిపై ప్రతీకారంతో రగిలిపోయిన భారత సైన్యం.. దాదాపు 40 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఆ సమయంలోనే భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాక్ భూభాగంలోకి ప్రవేశించి ఆ సైన్యానికి చిక్కారు. చర్చల అనంతరం ఆయనను భారత్కు పాక్ అప్పగించింది. అయితే అభినందన్ను అప్పగించడానికి ముందు పాక్లో ఓ ఆసక్తికర విషయం జరిగినట్టు లేటెస్ట్ గా బయటకు వచ్చింది.
అభినందన్ విషయంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా గజగజ వణికిపోయారని పాక్ పార్లమెంటు సభ్యుడు ఒకరు స్వయంగా వివరించారు. 2019 ఫిబ్రవరి నాటి ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తిరస్కరించారు, ఈలోగా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా సమావేశ మందిరంలోకి వచ్చారు. అప్పుడు ఆయన కాళ్లు వణుకుతూ శరీరమంతా చెమటలు పట్టి ఉంది. చర్చల అనంతరం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మొహమూద్ ఖురేషీ మాట్లాడుతూ.. మీకు పుణ్యముంటుంది.. అభినందన్ను వదిలేయండి .. లేదంటే ఇదే రోజు రాత్రి 9 గంటలకు భారత్ మనపై దాడి చేయడానికి సిద్ధమవుతోంది అన్నారని పాకిస్థాన్ ముస్లిం లీగ్ నేత, ఎంపీ అయాజ్ సాదిక్ నాటి సంఘటనను పార్లమెంటులో వివరించారు. దీంతో ఇమ్రాన్ ప్రభుత్వం భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను అప్పగించాలనే నిర్ణయానికి వచ్చిందని ఆయన తెలిపారు. పాక్ ఎంపీ మాట్లాడిన వీడియోను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అభినందన్ వర్ధమాన్ అరెస్ట్ సహా అన్ని విషయాలలోనూ ప్రభుత్వానికి ప్రతిపక్షం మద్దతుగా నిలిచిందన్నారు పాకిస్తాన్ నేత అయాజ్. కానీ ఈ విషయంలో మద్దతు ఇవ్వలేదు అన్నారు. ఇమ్రాన్ ప్రభుత్వం మాత్రం ప్రధాని నరేంద్ర మోడీతో తాము కుమ్ముక్కయ్యామని ఆరోపిస్తోందని మండిపడ్డారు.