రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకు నీతి - జాతి లేదని మంత్రులు, వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిగారిని అవమానపరచడం, తీవ్ర పదజాలంతో దూషించడాన్ని ప్రజలు క్షమించంటున్న మంత్రులు, వైసీపీ నేతలు.. నిన్నటి నుంచి జరుగుతున్న సంఘటనలను చూస్తే.. తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడుకోవడానికి, వారి పార్టీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపడానికి చంద్రబాబు నాయుడు పన్నిన కుట్రల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.
చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తున్న బూతులు, రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల వైసీపీ కార్యకర్తల్లోనే కాదు.. ప్రజల్లో కూడా ఆగ్రహం పెల్లుబుకుతోందంటున్నారు మంత్రులు, వైసీపీ నేతలు. చంద్రబాబు ఎందుకింత దిగజారిపోయారా అని ప్రజలు ఆలోచిస్తున్నారని... రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడటాన్ని బలుపు అంటారా? కండకావరం అంటారా? ఒళ్లు బలిసి కొట్టుకుంటున్నారని అనుకోమంటారా? అని మంత్రులు, వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
తెలుగు దేశం పార్టీని బతికించుకోవడం కోసం అత్యున్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడటం, పైగా దాన్ని సమర్థించుకోవడం సిగ్గుచేటని మంత్రి కన్నబాబు అన్నారు. తప్పు జరిగింది, మా వాడే ఏదో తెలిసీతెలియక మాట్లాడాడని చంద్రబాబే స్వయంగా క్షమాపణ చెబితే బావుండేదని కన్నబాబు అన్నారు. కానీ చంద్రబాబు దీన్నొక రాజకీయ అవకాశంగా తీసుకుని రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగినట్టు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.