రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాలు రెండింటికి కేసీయార్ గట్టి షాకిచ్చారు. ముందస్తు ఎన్నికల ముచ్చటే లేదని షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లోనే ఎన్నికలు జరుగుతాయని కేసీయార్ స్పష్టంగా తేల్చేశారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిదుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. కొంతకాలంగా తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు ఖాయమని బీజేపీ, కాంగ్రెస్ నేతలు గోలగోల చేస్తున్న విషయం తెలిసిందే. ఏదో పద్దతిలో కేసీయార్ పై మైండ్ గేమ్ ఆడి షెడ్యూల్ ఎన్నికలను ముందుకు వచ్చేట్లు చేయాలని పై రెండుపార్టీల నేతలు చాలా ప్రయత్నాలుచేశారు.





అయితే వాళ్ళ ఆలోచనలను పసిగట్టిన కేసీయార్ అసలు స్పందించనేలేదు. పైగా ప్రతినెలా పార్టీ పరిస్ధితి, తన మంత్రులు, ఎంఎల్ఏల పనితీరుపై రెగ్యులర్ గా సర్వేలు చేయించుకుంటున్నారు. తనకు అందుతున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులకు రెడీ అవుతున్నారు. సర్వేల్లో మైనసులున్న మంత్రులు, ఎంఎల్ఏలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. కొందరిని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. మొత్తంమీద షెడ్యూల్ ఎన్నికలకు ఎంఎల్ఏలతో పాటు యావత్ పార్టీని రెడీచేస్తున్నారు.





ఇదే సమయంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందస్తంటు నానా గోల చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు వీళ్ళు చాలాసార్లు ముహూర్తాలు కూడా పెట్టేశారు. నిజానికి కేసీయార్ ముందస్తు ఎన్నికలంటే ఇబ్బంది పడేది పై రెండుపార్టీలే. హఠాత్తుగా ముందస్తు ఎన్నికలంటే బీజేపీకేమో అన్నీ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులు దొరికే అవకాశంలేదు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వివాదాలతో రోజురోజుకు గబ్బుపట్టిపోతోంది.





ఇపుడు గనుక ఎన్నికలని కేసీయార్ అంటే రెండుపార్టీల సంగతి గోవిందానే. ఈ విషయం తెలిసి కూడా కేసీయార్ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలన్నారంటే పై పార్టీలకు మేలు చేసినట్లే అనుకోవాలి. షెడ్యూల్ ఎన్నికల కారణంగా పై రెండుపార్టీలు తమ లోపాలను సర్దుబాటుచేసుకునే అవకాశలున్నాయి. కాబట్టి కేసీయార్ ప్రకటన కారణంగా అందివచ్చిన అవకాశాన్ని పై పార్టీలు సద్వినియోగం చేసుకోవటంపై దృష్టిపెడితే బాగుంటుంది. అంతేకానీ ఇప్పుడుకూడా ముందస్తు గోలని కంటిన్యు చేస్తామంటే ఎవరు చేయగలిగేదేమీ లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: