దేశ వ్యాప్తంగా జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నరసారావుపేట పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఏపార్టీది గెలుపు అనే దానిపై బెట్టింగ్ లు ఇప్పటి నుంచే జోరుగా సాగుతున్నట్లు వినబడుతున్నాయి.ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ నాన్ లోకల్ అలాగే టీడీపీ అభ్యర్థి గా లావు శ్రీకృష్ణదేవరాయలు లోకల్. అయితే ఇక్కడ వీరి క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారం చూస్తే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు అనేది పెద్ద సస్పెన్స్ గా మారుతుంది అనేది విశ్లేషకుల అంచనా.ఇద్దరు యువనేతల మధ్య పోటీ అనేది "కులం" సమరంగా మారిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఇక్కడ కాసు వెంకటకృష్ణారెడ్డి తప్ప వరసగా రెండు సార్లు ఎవరూ గెలవలేదు. కూటమి అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రజల వద్దకు వెళుతుండగా, తాను ఒంటరిగానే ఉన్నానని, ఆదరించాలని కోరుతూ అనిల్ కుమార్ యాదవ్ ప్రజల్లోకి వెళ్తున్నారు.ఇద్దరిదీ వేర్వేరు సామాజికవర్గాలు ఒకరు బలమైన కమ్మ సామాజికవర్గం నేత కాగా, మరొకరు బలహీన వర్గాలకు చెందిన యాదవ్ సామాజికవర్గానికి చెందిన నేత. ఇద్దరూ తలపడుతుండటంతో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.నరసారావుపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఐనా చిలకలూరిపేట,గురజాల, నరసరావుపేట, పెదకూరపాడు, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి నియోజకవర్గాలున్నాయి.

ఈ నియోజకవర్గం యొక్క గత పరిస్థితులు చూస్తే ఇటు కమ్మ సామాజికవర్గం నేతలు ఎంపీగా ఎన్నికయినా ఎక్కువ సార్లు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే పార్లమెంటు సభ్యులయ్యారు. వరసగా 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి రాయపాటి సాంబశివరావు, 2019లో వైసీపీ నుంచి లావు కృష్ణదేవరాయలు గెలిచారు. అయితే ఈసారి గెలుపు విషయంలో మాత్రం నాడి అందడం లేదనే చెప్పాలి.ఇద్దరికీ సమానమైన ఛాన్స్‌లు ఉన్నాయన్నది అంచనా.గతంలో నెల్లూరు నుంచి వచ్చిన నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిలు కూడా ఇక్కడి నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ రెడ్డి సామాజివకర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా ఉన్నారు. కమ్మ సామాజికవర్గం ఓటర్లున్నప్పటికీ గెలిపించే స్థాయిలో మాత్రం లేరు. కానీ దీని పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో గురజాల, నరసారావుపేట, మాచర్ల నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి బలంగా కనిపిస్తుంది. అదే సమయంలో చిలకలూరిపేట,పెదకూరపాడు, వినుకొండ, సత్తెనపల్లిలో టీడీపీ బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పోటీ మాత్రం మామూలుగా లేదు. అందుకే నరసరావుపేటలో విజయం చివర వరకూ దోబూచులాడక తప్పదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే చివరి వరకు గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: