- పదిసార్లు అసెంబ్లీకి ఎన్నికైన సెన్షేషనల్ రికార్డ్ ఈ ఫ్యామిలీ సొంతం
- మూడో తరంలో బీసీ లేడీ ఐకాన్ లీడర్గా శిరీషపై భారీ అంచనాలు
( ఉత్తరాంధ్ర ప్రతినిధి - ఇండియా హెరాల్డ్ )
కొన్ని కొన్ని కుటుంబాలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రత్యేక ఇంట్రడక్షన్తోనూ పనిలేదు. వారి పేరుతోనూ పనిలేదు. కేవలం ఇంటి పేరు చెబితే చాలు... వారి వ్యక్తిత్వం వారి సేవ వంటివి కళ్ల ముందు కనిపిస్తాయి. ఇలాంటి వారిలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన గౌతు కుటుంబం ఫస్ట్ ప్లేస్లో ఉంది. సర్దార్ గౌతు లచ్చన్నతో ప్రారంభమైన ఈ కుటుంబం రాజకీయాలు, ప్రజా సేవ, ప్రాంతీయ సేవ వంటివి .. మూడు తరాలుగా నేటికీ కొనసాగుతున్నాయి.
1950లో ఆచార్య రంగా `కృషి కార్ లోక్ పార్టీ`ని స్థాపించినప్పుడు గౌతు లచ్చన్న ప్రధాన పాత్ర పోషించా రు. 1952లో సోంపేట నియోజకవర్గం నుండి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. మద్రాసు ప్రభుత్వం నుంచి ఆంధ్రులకు రావలసిన ఆస్తుల విభజనను పరిశీలించడానికై ఏర్పడిన ఆంధ్ర సంఘంలో కాంగ్రెస్ నుంచి నీలం సంజీవరెడ్డి, ప్రజా పార్టీ నుంచి తెన్నేటి విశ్వనాధం, కృషి కార్ లోక్ పార్టీనుంచి లచ్చన్న సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత.. ప్రకాశం పంతులు మంత్రివర్గంలోనూ, బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలోనూ, లచ్చన్న మంత్రిగా పనిచేశారు. మొత్తంగా ఐదు సార్లు ఈయన ప్రజాక్షేత్రంలో విజయం దక్కించుకున్నారు.
లచ్చన్న కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. సామాజిక సేవను ఆయన అణువణువుగా నింపుకొన్నా రు. ఇదే ఆయనను ముందు వరుసలో నిలిపింది. ఆ తర్వాత.. ఆయన వారసుడిగా గౌతు శ్యామ్ సుందర్ శివాజీ అరంగేట్రం చేశారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న శివాజీ అదే స్థాయిలో ప్రజలకు చేరు వయ్యారు. నీతి, నిజాయితీలను కుడి ఎడమలుగా భావించే శివాజీ.. అదే స్థాయిలో రాజకీయ జీవితాన్ని ముందుకు సాగించారు. అనేక సమస్యల పరిష్కారంపై పోరాటం చేశారు. తండ్రి ఎలా అయితే.. ప్రజలకు చేరువ అయ్యారో.. అదే విధంగా శివాజీ కూడా ప్రజలకు చేరువయ్యారు.
సుధీర్ఘకాలం చట్టసభలకు ప్రాథినిత్యం...
గౌతు లచ్చన్న ఐదుసార్లు అసెంబ్లీకి, ఓ సారి ఎంపీగా గెలిస్తే.. ఆయన తనయుడు గౌతు శివాజీ సైతం ఏడు సార్లు అసెంబ్లీకి ఎంపికయ్యారు. లచ్చన్న తన గురువు ఎన్జీ రంగా గుంటూరులో ఎంపీగా ఓడిపోతే లచ్చన్న తాను శ్రీకాకుళంలో ఎంపీగా గెలవడంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేసి రంగాను ఇక్కడ పోటీకి పెట్టించి ఎంపీగా గెలిపించారు. ఇలాంటి రాజకీయ నేతలు ఈ తరంలో భూతద్దంలో పెట్టి వెతికినా ఒక్కడూ ఉండడు.
మూడో తరంలో శిరిష ఎంట్రీ...
ఇక, మూడో తరం వారసురాలిగా.. గౌతు శిరీష కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఎక్కడ సమస్య ఉంటే.. అక్కడ తాను.. అన్నట్టుగా ఆమె వ్యవహరిస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. బలమైన గళం వినిపిస్తూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. దీంతో సిక్కోలు సివంగిగా ఆమె జనాలతో జేజేలు కొట్టించుకుంటున్నారు. పైగా ఆమె బీసీ మహిళా నేతల్లో బలమైన ఐకానిక్ లీడర్గా ఎదిగే స్కోప్ ఉంది. ఆమె విషయంలో కొన్ని కోట్ల మంది బీసీలకు బలమైన ఆకాంక్ష ఉంది. అవన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో శిరీష.. పలాస నుంచి తన అదృష్టాన్ని రీక్షించుకుంటున్నారు. ఏదేమైనా.. గౌతు కుటుంబం.. నాడు-నేడు.. ప్రజల వైపే అనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.