![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/there-is-a-tussle-in-the-alliance-is-it-the-candidate-who-did-not-get-the-ticket0fb4886d-1f44-4d9f-8888-2fb6109e5f8b-415x250.jpg)
కూటమిగా కొన్ని పార్టీలు బరిలోకి దిగితే కేవలం నియోజకవర్గంలో ఒక పార్టీకి మాత్రమే పోటీ చేసే అవకాశం లభిస్తుంది. అయితే విభిన్న పార్టీల తరుపున స్థానికంగా పని చేసిన నాయకులు టికెట్ ఆశించి భంగ పడడం ఖాయం. ఇదే తరహా వాతావరణం నంద్యాలలో కూడా కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డి టీడీపీ తరుపున పోటీ చేసి తన ప్రత్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై 27,000లకు పైగా మెజార్టీతో గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో ఇక్కడ జగన్ మేనియా పని చేసింది. దీంతో భూమా బ్రహ్మానంద రెడ్డి భారీ తేడాతో ఓడిపోయారు. స్థానికంగా ముస్లిం జనాభా కూడా అధికంగా ఉంది. దీంతో ఆ వర్గానికి టికెట్ ఇస్తే విజయావకాశాలు పెరుగుతాయనే అంచనాతో ఎన్ఎండీ ఫరూఖ్కు టికెట్ కేటాయిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు పార్టీ క్యాడర్ను కాపాడుకుంటూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన భూమా బ్రహ్మానంద రెడ్డి దీనిపై అలకబూనారు. దానిని మాత్రం పైకి కనపడనీయడం లేదు. ఓ వైపు చంద్రబాబును సీఎం చేయాలంటూనే స్థానిక అభ్యర్థికి మాత్రం కొంచెం కూడా సహకరించడం లేదు. దీంతో స్థానికంగా టీడీపీ అభ్యర్థి విజయావకాశాలపై ఇది ప్రభావం చూపనుంది.