దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది యూరియా కొరత. ఎక్కడ చూసినా రైతులు యూరియా కోసం క్యూలలో నిలబడుతున్నారు. పంటల సాగు సీజన్‌లో ఈ కొరత రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా యూరియాకు డిమాండ్ పెరిగిపోయి, సరఫరా కుదరక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా అంటే ఏమిటి? .. సాధారణ ప్రజలకు తెలియకపోయినా, రైతులకు యూరియా ప్రాణం లాంటిది. ఇది నైట్రోజన్ ఆధారిత రసాయనిక ఎరువు. నీటిలో సులభంగా కరిగే ఈ యూరియా పొలాల ఉత్పాదకతను పెంచుతుంది. హెక్టారుకు 40 కిలోల నుండి 300 కిలోల వరకు వాడతారు. కానీ నిపుణులు చెబుతున్నట్లుగా ఎక్కువ యూరియా వాడటం ప్రమాదకరం. రైతులు దీన్ని నియమిత మోతాదులోనే వాడితేనే పంటలకు మేలు.


అధిక వాడకమే అసలు సమస్య .. ఇటీవలి కాలంలో రైతులు సేంద్రియ ఎరువుల కంటే యూరియాపైనే ఆధారపడుతున్నారు. అధిక దిగుబడి కోసం అధిక యూరియా వాడటం అలవాటైపోయింది. అందుకే ఇప్పుడు యూరియా ఒక నిత్యావసర వస్తువులా మారింది. సరఫరా డిమాండ్‌ను తీరించలేకపోవడంతో కొరత తలెత్తింది. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు .. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు యూరియా వాడకం మీద సీరియస్‌గా మాట్లాడారు. "యూరియా అధికంగా వాడితే క్యాన్సర్ మహమ్మారి వస్తుంది" అని ఆయన హెచ్చరించారు. పంజాబ్ ఉదాహరణగా చూపిస్తూ – "ప్రతీ రోజూ అక్కడి నుంచి క్యాన్సర్ రోగులను తీసుకుని ప్రత్యేక రైళ్లు ఢిల్లీకి వెళ్తున్నాయి" అని అన్నారు. ఏపీలో కూడా క్యాన్సర్ కేసులు టాప్ 5లో ఉన్నాయని బాబు ఆందోళన వ్యక్తం చేశారు.



రైతులకు ప్రోత్సాహకాలు .. "యూరియా వాడకాన్ని తగ్గించండి" అంటూ రైతులకు చంద్రబాబు స్పష్టమైన సందేశం ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఎవరైతే యూరియా వినియోగం తగ్గిస్తారో వారికి ప్రతి కట్టకు 800 రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఆయన ప్రకటించారు. అధిక ఎరువుల వాడకంతో మన మిరపను చైనా తిరస్కరించిందని, యూరప్ దేశాలు కూడా ధరలు తగ్గిస్తున్నాయని బాబు గుర్తు చేశారు. మంచి ఆలోచన కానీ … బాబు చెప్పిన మాటలు నిజమేనని అందరూ అంగీకరిస్తున్నారు. అధిక దిగుబడికోసం చేసే తప్పులు చివరికి రైతులకు, వినియోగదారులకు, సమాజానికే నష్టం చేస్తాయి. విషతుల్యమైన పంటలతో ఆరోగ్యం బలహీనమవుతుంది. రైతులు సేంద్రీయ ఎరువుల వైపు మళ్ళితేనే బలమైన సమాజం నిర్మాణం అవుతుంది. అయితే రైతులు బాబు మాటలు ఎంతవరకు ఆచరిస్తారన్నది చూడాల్సిందే. ఒకవైపు యూరియా కొరత – మరోవైపు అధిక వినియోగం సమస్య. రైతాంగం ఇప్పుడు మలుపు వద్ద నిలిచింది. బాబు సూచనలతో నిజంగానే రైతుల‌లో మార్పు తీసుకొస్తారా? లేక పాత పద్ధతులకే కట్టుబడి ఉంటారా? అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: