దేశం సురక్షితంగా ఉందని అనుకుంటున్నాం... కానీ నిజం మాత్రం భయంకరంగా మారుతోంది! మన చుట్టూ సాధారణ మనుషుల్లా తిరుగుతున్న కొందరు దేశ విరోధులు, నిశ్శబ్దంగా విధ్వంసానికి సిద్ధమవుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో బయటపడిన ఉగ్రకుట్ర ఈ నిజాన్ని మరింత స్పష్టంగా చూపించింది. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన వైద్యుడు అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైద్య వృత్తిలో ఉంటూ, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వ్యక్తి… దేశ ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా వ్యవహరించడం ఆశ్చర్యకరం. సమాచారం ప్రకారం, అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మహ్మద్ సుహేల్ సలీంఖాన్ లతో కలిసి దేశంలో పలు నగరాల్లో పేలుళ్లకు ప్రణాళిక సిద్ధం చేశాడు.


వీరు దేశ వ్యాప్తంగా రద్దీ ప్రాంతాల్లో బాంబు దాడులు జరపాలని యోచించారు. అయితే ఐసిస్‌కు చెందిన అబూ ఖదీజా ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే పోలీసులు వీరి కుట్రను పసిగట్టారు. అలా కాకపోతే దేశంలో మరిన్ని ప్రాణనష్టాలు జరిగేవి, హైదరాబాద్ కూడా లక్ష్యంగా మారేదని అధికారులు చెబుతున్నారు. అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ నేపథ్యం చూసినా ఆశ్చర్యమే. ఖమ్మంలో ప్రాథమిక విద్య, వరంగల్ లో ఇంటర్, ఆ తర్వాత వైద్య విద్య కోసం 2007లో చైనాకు వెళ్లాడు. చదువు పూర్తయ్యాక తిరిగి రాష్ట్రానికి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. మొదట వైద్యుడిగా పనిచేసిన అతను, ఆ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. అత్తాపూర్ లోని ఒక హోటల్ లో భాగస్వామి అయ్యాడు. ఆన్‌లైన్ కన్సెల్టెన్సీ ప్రారంభించి మంచి పేరును సంపాదిస్తున్నప్పటికీ, ఆ మధ్యకాలంలో ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడయ్యాడు.



ఇక‌ తర్వాత తన గదిలో రైసిన్ (Ricin) అనే అత్యంత ప్రమాదకర విషపదార్థాన్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. ఈ పదార్థంతో ప్రజలను చంపే కుట్రలో భాగస్వామిగా మారాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దేశంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు పూర్తి సిద్ధతలో ఉండగా, అబూ ఖదీజా ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే గుజరాత్ ఏటీఎస్ అతనిని పట్టుకుంది. హైదరాబాద్ నుంచి ఉగ్ర లింకులు వెలుగుచూడటం ఇదే మొదటిసారి కాదు. అందుకే నగర పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధిక అప్రమత్తతలో ఉన్నాయి. వైద్య వృత్తి వంటి పవిత్ర రంగంలో పనిచేస్తున్న వ్యక్తి ఉగ్రవాద మార్గం పట్టడం సమాజానికి పెద్ద హెచ్చరికగా మారింది. మొత్తం మీద... "ఉగ్రమూకలు మన మధ్యనే ఉన్నాయ్… కానీ మనకు తెలియదు!" అనిపించేలా ఈ ఘటన దేశాన్ని మరోసారి కుదిపేసింది!

మరింత సమాచారం తెలుసుకోండి: