ఏపీలో ప్రధాని ప్రతిపక్షం వైసీపీకి ఇప్పుడు సెగలు పుడుతున్నాయి! నిన్న మొన్నటి వరకు తమ పట్ల ప్రజల్లో సానుకూల దృక్ఫథం ఉందని భావించిన ఈ పార్టీ నేతలకు ఇప్పుడు అసలు విషయాలు తెలిసే సరికి నానా హైరానా పడుతున్నారట. 2019లో అధికారంలోకి రావాలని గట్టిగా నిర్ణయించుకున్న వైసీపీ అధినేత జగన్.. ఆ దిశగా వేస్తున్న అడుగుల్లో అత్యంత కీలకమైన అడుగు రాజకీయ, ఎన్నికల సలహాదారుగా బిహార్కు చెందిన ఐఐటీయన్ ప్రశాంత్ కిశోర్ని నియమించుకోవడం. సుమారు 50 కోట్ల ప్యాకేజీతో పీకేని రంగంలోకి దింపారు. ఎట్టి పరిస్థితిలోనూ 2019లో అధికారం వచ్చేలా చేయాలని ఆయనకు దిశానిర్దేశం చేశారు. ఏం చేసినా.. ఎలా చేసినా.. తనకు మాత్రం సీఎం సీటు అప్పగించాలని పీకేకి జగన్ మొరపెట్టుకున్నారు.
ఈ క్రమంలో సమరోత్సాహంతో ముందుకు కదిలిన పీకే తన బుర్రకు బుద్ధి చెప్పి పదుల సంఖ్యలో ఐడియాలను వరద రూపంలో పారించాలని ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పుట్టుకొచ్చిందే.. నవరత్నాలు ఐడియా. విజయవాడలో జరిగిన వైసీపీ ప్లీనరీ సందర్భంగా ఎన్నికలకు దాదాపు రెండేళ్లకు ముందే జగన్ హామీల వరద పారించారు. నవరత్నాలు పేరుతో అత్యంత కీలకమైన తొమ్మిది హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక, పీకే సూచనలతో జగన్ మోహన్ రెడ్డి.. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఇడుపుల పాయలో మొదలయ్యే ఈ పాదయాత్ర ఇచ్చాపురం వరకు అన్ని జిల్లాలను కలుపుతూ సాగుతుందని జగన్ ప్రకటించారు.
ఈ పరంపరలో పీకే వైసీపీ పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తన టీం సభ్యులను అన్ని జిల్లాలకు పంపుతున్నారు. ఆయా జిల్లాల్లో నేరుగా ప్రజలను కలిసి వారి అభిప్రాయం సేకరిచండం ద్వారా వైసీపీ పరిస్థితిని అంచనా వేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. 2019 నాటికి పార్టీ పుంజుకునేందుకు అవసరమైన మార్పులు చేయాలని కూడా ఆయన కింది స్థాయి నేతలకు పురమాయించారు. ఇక, ఒక్కొక్క జిల్లాలో ముగ్గురు చొప్పున పీకే బృందం పర్యటించి ఆయా జిల్లాల్లోని అన్ని సమస్యలు తెలుసుకోవాలని, ఫలితంగా పార్టీని సంస్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని పీకే అభిప్రాయపడ్డారు.
రంగంలోకి దిగిన సర్వే బృందం.. ఒక్కొక్క జిల్లాను జల్లెడ పడుతోంది. ఆయా జిల్లాల్లోని వైసీపీ ఇంచార్జ్లను పరిశీలిస్తోంది. నేరుగా వారి నుంచే కీలకమైన సమాచారాన్ని రాబాడుతోంది. ఈక్రమంలోనే వైసీపీ నేతల బృందం ఇటీవల గుంటూరు, కృష్ణాజిల్లాలలోని కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించింది. ఇక్కడ వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలపై ఆరాతీసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆయా చోట్ల పనులు ఏమి చేయడంలేదని స్పష్టం చేశారట. మండలస్థాయి నాయకత్వాలపై కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయట. కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు, ఎమ్మెల్యేలు... ప్రశాంత్ కిశోర్ బృంద సభ్యులను మేనేజ్ చేసేందుకు వారి పర్యటనలను ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేశారట. తమకు అనుకూలంగా ఉన్నవారితో అభిప్రాయాలు చెప్పించి బృందాన్ని సాగనంపారని తెలిసింది
ఇక, విజయనగరంలో పర్యటించిన పీకే బృందానికి అక్కడి నేతలు భలే జర్క్ ఇచ్చారని తెలిసింది. జగన్ తన వైఖరిని మార్చుకోవాలని స్పష్టం చేశారట. ఎంతసేపూ ...తాను చెప్పిందే వినాలనేధోరణిని జగన్ విడనాడాలని, ఇదే పెద్ద మైనస్ మార్కులాగా ఉందని అన్నారట. కిందిస్థాయి కేడర్లోనూ పార్టీని డెవలప్ చేసుకోవాలనే కోరిక బలంగానే ఉంటుందని, వారి మాటకు కూడా విలువ ఇవ్వాలని కోరాట. ఇదే విషయాన్ని నేరుగా పీకే బృందం రికార్డు చేసింది. దీనిని తెలుసుకున్న వైసీపీ సీనియర్ నేతలు కూడా ఉన్న విషయాన్ని ఇప్పటికైనా జగన్ చెవిలో పడేయాలని ఈ బృందం నిర్ణయించుకుందట.
ఇదే జరిగితే.. రాబోయే రోజుల్లో వైసీపీలో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. అధికారం చేపట్టడమే ధ్యేయం అని ఇప్పటికే జగన్ వెల్లడించాడు. ఈ క్రమంలో ఆయనకు అడ్డుపడుతున్న ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు పీకే సర్వే.. వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఎన్నికలకు రెండేళ్ల సమయమే ఉండడం, విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం నేపథ్యంలో పీకే సర్వే వారిలో గుబులు రేపుతోంది.