డ్రాగన్ చైనా ఆర్ధికంగా అసహాయ స్థితిలో కూరుకుపోతుందా? కమ్యూనిస్ట్ దేశం చైనా లో అవినీతి భూతం విశృంఖల విహారం చేస్తూ ఉందా? చైనాను పతనం చేసే స్థాయికి అవినీతి పెరిగిందా? సోవియట్ యూనియన్ లా చైనా ఏదో ఒకరోజు కుప్పకూలి పోనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. చైనా ఉన్నతాధికారులే దీనిని బలపర్చ డం విశేషం.
చైనా, కమ్యూనిస్ట్ ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక శక్తి. సోవియట్ యూనియన్ తరువాత అంతటి స్థాయికి ఎదిగిన దేశం. అవినీతి భూతం చైనా అర్థిక పునాదులను కూలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. చైనా బయటి దేశాలతో చేసే యుద్ధం కన్నా, దేశంలోని పెరిగిన అవినీతితో యుద్ధం చేయాలని, లేకపోతే అత్యంత వేగంగా సోవియట్ యూనియన్ తరహాలో చైనా విచ్ఛిన్నం అవుతుందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ 25వ పొలిట్ బ్యూరోలో కీలక నేతగా ఎదిగిన యాంగ్ క్సియాడు అవినీతిపై స్పష్టమైన ప్రకటన చేశారు.
చైనాలో గత ప్రభుత్వాలు దేశంలో అవినీతిని ప్రోత్సహించాయి. అవినీతి పరులు పార్టీని శాసించే స్థాయికి నేడు చేరుకున్నారు. ఇది దేశానికి చాలా ప్రమాదకరమని యాంగ్ చెప్పారు. అవినీతి పరులు బలపేతం కావడంతో పార్టీ బలహీనపడే స్థాయికి చేరిందని కూడా ఆయన స్పష్టం చేశారు. దేశంలో విశృంఖలంగా పెరిగిన అవినీతిని కట్టడి చేయాలని ఆయన అధ్యక్షుడు జిన్పింగ్ ను కోరారు. అవినీతిని కట్టడి చేయలేకపోతే, చైనా మరో సోవియట్ యూనియన్ అవుతుందని యాంగ్ హెచ్చరించారు.
అధ్యక్షుడు జిన్పింగ్, ఇతర కీలకమంత్రులు, ఉన్నతాధికారులు ఇప్పటికే పార్టీలో పట్టుకోల్పోతున్నారని, యాంగ్ ప్రకటించారు. పార్టీపై కీలకనేతలు పట్టుకోల్పోతే అత్యంత తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యాంగ్ పేర్కొన్నారు. భారీగా పెరిగిన అవినీతి వల్ల చైనా ఎప్పుడైనా కూలి పోవచ్చనే సందేహాలు వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా మేల్కోపోతే దేశ ప్రజలు, పార్టీ భవిష్యతు నాశనం అవుతుందని, సోవియట్ యూనియన్ తరహాలో పతనం అయ్యే అవకాశం ఉందని యాన్ వ్యాఖ్యానించారు. జిన్పింగ్, ఇతర ముఖ్య నేతలు పార్టీపై పట్టు కోల్పోవడం వల్ల అది దేశ విభజనకు దారి తీయొచ్చని ఆయన హెచ్చరించారు. కమ్యూనిస్ట్ పార్టీ యాంటీ కరప్షన్ బాడీలో కీలక పదవిలో ఉన్న ఝావో లెజి కూడా యాంగ్ తరహాలోనే ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. జిన్పింగ్ తర్వాత చైనాలో రెండో శక్తివంతమైన నేతగా కొనసాగుతున్న వాంగ్ క్విషాన్ను గత నెలలోనే చైనా అవినీతి నిరోధక విభాగం చీఫ్గా నియమించింది.