ఆషాడమాసములో వచ్చే గురుపౌర్ణమి ఎంతో విశిష్టమైనదిగా చెప్పుకుంటాము. ఈ గురుపౌర్ణమి రోజు సాయిబాబాకి ఎంతో  ఇష్టమైన  పులగంని భక్తి శ్రద్దలతో నైవేద్యంగా పెడితే ఎంతో మంచిది.ఈ పులగం చేయడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది.  కొత్త బియ్యం, పెసర పప్పు, నెయ్యి, మిరియాలు జోడించి చేసే ఈ వంటకం చేస్తే రుచిలోనే కాదు, పోషకాల పరంగానూ ఎంతో మేలైనది. ఇప్పుడు ఆ పులగం తయారీ ఎలాగో తెలుసుకుందాం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే వంటకం పులగం. అలాగే  త్వరగా తయారు చేసుకోదగిన ఈ అల్పాహారం చాలా సులభంగా జీర్ణమవుతుంది.


కావాల్సిన పదార్థాలు :

 1)పెసర పప్పు           -           1 గ్లాసు
 2)బియ్యం               -           2 గ్లాసులు
 3)నెయ్యి లేదా నూనె   -          సరిపడా
4)మిరియాలు           -         అరచెంచా  
5)అల్లం ముక్కలు       -         పావు చెంచా 6)ఇంగువ               -          చిటికెడు
7)ఉప్పు                  -          రుచికి తగినంత 8)జీడిపప్పులు         -            10
9)కరివేపాకు            -             రెండు రెమ్మలు

తయారీ విధానం : ముందుగా పైన చెప్పిన కొలత ప్రకారం వేరు వేరు గిన్నెల్లో పెసర పప్పు, బియ్యం తీసుకొని కడిగి మునిగే వరకు నీళ్ళో పోసి కనీసం 2 గంటలపాటు నానబెట్టుకోవాలి. బియ్యం ఎంత బాగా నానితే పులగం అంత మృదువుగా వస్తుంది. అవి బాగా నానిన తర్వాత  ఒక పాత్ర తీసుకొని అందులో నెయ్యి వేసి కాగనిచ్చి ఆందులో ముందుగా జీలకర్ర, తర్వాత దంచిన మిరియాలు, చివరగా చిటికెడు ఇంగువ వేయాలి.అలాగే కొంచెం కరివేపాకు కూడా వేయాలి.  ఇందులో ఏ ఇతర తాలింపు గింజలూ వేయొద్దు. ఇప్పుడు 6 గ్లాసుల నీళ్లు(గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల నీళ్ల చొప్పున) ఎసరుగా పోయాలి. రుచికి కావాలంటే చిన్న గ్లాసుడు పాలు కూడా పోసుకోవచ్చు. ఎసరు బాగా కాగిన  తర్వాత నాన బెట్టుకున్న బియ్యాన్ని వేసి ఉడకనివ్వాలి. బియ్యం ఉడుకు పట్టిందనగానే  నానబెట్టుకున్న పెసరపప్పు వేసి బాగా కలతిప్పి ఉడికించాలి. రెండూ బాగా దగ్గరకయ్యాక  తగినంత ఉప్పు,  సన్నగా తరిగిన  కాసిన్ని అల్లం ముక్కలు కలుపుకోవాలి.మరీ గట్టిపడక ముందే దించి మరికాస్త నెయ్యి వేసి కలిపి నేతిలో వేయించిన జీడిపప్పు చల్లుకొంటే ఘుమఘుమలాడే పులగం తయారైనట్టే. ఏదైనా రోటి పచ్చడితో నంజుకొని తింటే దీని రుచి అమోఘం.. అలాగే పులగం బాబాకి నైవేద్యం పెట్టి ఆ బాబా ఆశీస్సులు తీసుకోండి... !!

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: