భారతదేశం సంప్రదాయాలకు పట్టుకొమ్మలాంటి దేశం. ఇక్కడ ప్రజలు సంస్కృతి సంప్రదాయలకు ఎంతో గౌరవం ఇస్తారు. ముఖ్యంగా హిందు ధర్మంలో దేవాలయాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. భగవంతుడిని కొలిచేందుకు మాత్రమే కాదు.. మానసిక ప్రశాంతత కోసం కూడా ఎంతో మంది ఆలయాలకు వెళ్తుంటారు. ఇలా గుళ్లకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా చేసేది కొబ్బరి కాయ కొట్టడం. దేవుడికి ధన కనక వస్తువులనో లేదా వారి వారి తాహతుకు తగినట్లు ఎంతో కొంత సొమ్ము సమర్పించవచ్చు కదా.. కొబ్బరికాయే ఎందుకు కొడతారు అనే సందేహం అందరికీ కలుగుతుంది. అయితే అసలు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, దాని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి అన్నది చాలామందికి తెలియదు.

హిందూ పురాణాల ప్రకారం కొబ్బరి కాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నిజానికి టెంకాయను మనిషి తలతో పోలుస్తారు. కొబ్బరి కాయ మీద ఉన్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు. అంతే కాకుండా గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో, కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు. ఇక టెంకాయను కొట్టిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని మనస్సుగా భావిస్తారు. అయితే కొబ్బరిని దేవుడికి కొట్టినప్పుడు మనసులో వున్న కల్మషం, అహంకారం, ఈర్ష్యాద్వేషాలు అన్ని తొలగుతాయని వేద పండితులు చెబుతున్నారు. అందుకే కొబ్బరి కాయను ఆలయంలో కొడతారు.

అంతేకాకుండా టెంకాయను కొట్టినప్పుడు కొంతమందికి పువ్వు వొస్తుంది. మరి కొంతమంది కొట్టినప్పుడు లోపల పెరుగుగా కనిపిస్తుంది. అయితే దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోతే మంచిదా లేక అపచారమా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. కొంత మంది కాయ కుళ్లితే కీడు సంభవిస్తుందని, చెడు జరుగుతుందని ఆందోళనకు చెందుతారు. అయితే అంత ఆందోళన చెందాల్సిన పనిలేదు సానుకూల దృక్పథంతో ఆలోచించి మనసులోని కుళ్లు ఈ రూపంలో వెళ్లిందని భావించాలి. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా, అందులో పువ్వు వచ్చినా చాలా సంతోష పడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: