జబర్దస్త్ షోకు దూరం కావడం గురించి నాగబాబు గతంలో కొన్ని వీడియోలు చేసి కొంతమేర వివరాలు వెల్లడించారు. కానీ అసలు కారణం మాత్రం బయటపెట్టలేదు. అయితే మళ్లీ ఆయన జబర్దస్త్ షోలో అడుగుపెడతారేమోనని కొందరు అభిమానులు భావిస్తున్న నేపథ్యంలో.. నాగబాబు ఓ షాకింగ్ విషయం వెల్లడించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ జబర్దస్త్లో మళ్లీ అడుగుపెట్టనని, ఆ షోకు, తనకు సంబంధాలు తెగిపోయాయని తేల్చి చెప్పారు. తాజాగా నెటిజన్ల నుంచి జబర్దస్త్ షోకు సంబంధించి, జబర్దస్త్ షోకు రీఎంట్రీకి సంబంధించి ప్రశ్నలు ఎదురు కాగా నాగబాబు ఆ ప్రశ్నలకు ఈ విధంగా సమాధానమిచ్చారు.
ఇటీవల నాగబాబు ఓ ఆన్లైన్ లైవ్ సెషన్ నిర్వహించారు. అందులో ఓ నెటిజన్.. ‘జబర్దస్త్ నిర్వాహకులు అడిగితే మీరు మళ్లీ జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇస్తారా.? అని ప్రశ్నించాడు. దానికి నాగబాబు సమాధానమిస్తూ.. ‘ఆ షోలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చే అవకాశమే లేద’ని తెగేసి చెప్పారు. అలాగే మరో యూజర్.. జబర్దస్త్ లేదా అదిరింది షోలలో ఫేవరెట్ షో ఏదని ప్రశ్నించగా.. నాగబాబు వెంటనే ‘బొమ్మ అదిరింది’ అంటూ సమాధానం ఇచ్చారు. అలాగే మల్లెమాల వాళ్లతో సైద్ధాంతికపరమైన విభేదాల వల్లే జబర్దస్త్ షోకు దూరమయ్యానని, అసలు కారణాన్ని బయటపెట్టారు.
ఇదిలా ఉంటే నాగబాబు ప్రస్తతుం జీ తెలుగు ఛానల్లోనే భవిష్యత్తులో జరగబోయే ప్రోగ్రామ్స్కు జడ్జిగా వ్యవహరించే అవకాశాలున్నాయి. నాగబాబు యూట్యూబ్లో ఖుషీ ఖుషీగా అనే స్టాండప్ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించగా ఆ షో సీజన్ 1 తాజాగా పూరైంది. రాబోయే రోజుల్లో ఖుషీ ఖుషీగా సీజన్ 2 ప్రసారమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు రోజాతో పాటు సింగర్ మనో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.