ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచదేశాల ప్రజలకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ఎందరో ప్రజలు బలైపోయారు. ఇంకెందరో కరోనా సోకి హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రాణాంతకర వైరస్ పుట్టడానికి చైనానే కారణమని.. చాలా దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. మరోవైపు చైనీస్ యాప్ అయిన టిక్ టాక్ మత విద్వేషాలు రెచ్చగొట్టడమే కాకుండా, జంతు హింస, తప్పుడు మార్గాలను ప్రేరేపించేలా ఉండే వీడియోలను ప్రోత్సహిస్తోందంటూ ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఇలా మరెన్నో కారణాల వల్ల భారతీయులు చైనా యాప్లపై యుద్ధం ప్రకటించారు.
అయితే ఇదే సమయంలో ప్రధాని మోడీ కూడా ‘ఆత్మ నిర్భర్’ పేరుతో జాతీయ ఉత్పత్తులు ప్రోత్సహించి విదేశీ వస్తువులను పక్కన పెట్టాలన్న సూచన చేయడంతో విదేశీ యాప్ ల పై వార్ స్టార్ట్ చేశారు ఇండియన్స్. ఇందులో భాగంగా.. మోడీ స్ఫూర్తితో ‘వన్ టచ్ యాప్ ల్యాబ్స్’ సంస్థ ‘రిమూవ్ చైనా యాప్స్’ అనే యాప్ ను తయారు చేసింది. ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే.. దీన్ని ఇన్ స్టాల్ చేసుకుంటే చైనా యాప్స్ అన్నింటిని కనిపెట్టి ఒకేసారి వాటన్నింటిని తీసివేస్తుంది. అన్ ఇన్ స్టాల్ చేస్తుంది. ప్రస్తుతం ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. రెండు వారాల కిందట మే 17న వచ్చిన ఈ యాప్ని ఇప్పటికే 10 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారంటే.. ఈ యాప్ ఏ రేంజ్లో దూసుకుపోతోందో అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలోనే అనతికాలంలో గూగుల్ ప్లేస్టోర్లో ఉచిత యాప్స్ జాబితాలో టాప్-2 స్థానానికి ఎగబాకి రికార్డు సృష్టించింది. అలాగే ఈ యాప్కి 4.8 భారీ రేటింగ్ కూడా ఉంది. అయితే రిమూవ్ చైనా యాప్స్ ప్రస్తుతం ఆండ్రాయిడ్లో మాత్రమే అందుబాటులో ఉంది. అతి త్వరలో దీన్ని యాపిల్కి చెందిన యాప్ స్టోర్లో కూడా అందుబాటులోకి తేనున్నారు. ఇక ఈ యాప్ చాలా తక్కువగా 3.5 MB స్పేస్ మాత్రమే తీసుకుంటోంది. క్షణాల్లో ఉచితంగా డౌన్లోడ్ అవుతోంది. ఇన్స్టాల్ చేశాక... 'స్కాన్ నౌ' ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది. ఈ యాప్లో బిన్ ఆప్షన్ నొక్కగానే... మీ మొబైల్లోని చైనా యాప్స్ అన్నీ అన్ఇన్స్టాల్ అవుతాయి.