తెలంగాణ రాజకీయాలు శర వేగంగా మారుతున్నాయి. అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తూ పాలన సాగిస్తుండగా.. ఓ పక్క బీజేపీ.. మరోవైపు బీఆర్ఎస్ లు సంవత్సరం తర్వాత ప్రభుత్వం కూలిపోతుందనే ప్రకటనలు ఇస్తున్నారు.  దీని వెనుక ఆంతర్యం ఎవరికీ అర్థం కాకపోయినా.. బీజేపీ, బీఆర్ఎస్ లు కలుస్తాయా అనే అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి.  


బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటనలకు మారు పేరు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మరో ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని.. వచ్చేది తమ ప్రభుత్వమేనని బాంబ్ పేల్చారు.  ఇప్పుడు మరోసారి తమ పోరాటం కాంగ్రెస్ పైనే అని బీఆర్ఎస్ కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బీఆర్ఎస్ ను తక్కువ చేసి చూస్తున్నారా.. లేక ఆ పార్టీతో కలిసే ఉద్దేశంలో అలా మాట్లాడారా అనేది ప్రస్తుతం అంతు  చిక్కడం లేదు.


రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి సహజంగా ప్రతి పక్ష పార్టీల తొలి టార్గెట్ అధికార పార్టీ అవుతుంది.  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీతో కాకుండా స్థానిక బీఆర్ఎస్ ప్రభుత్వంపైనే కాంగ్రెస్ విమర్శలు సంధించింది.  అలాగే ప్రస్తుతం బీజేపీ కూడా అధికార కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుంది.


మరోవైపు బీఆర్ఎస్ ను విమర్శించడం వల్ల బీజేపీకి వచ్చే అదనపు ప్రయోజనం అంటూ ఏమీ లేదు.  అది కూడా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీనే. మరోవైపు భవిష్యత్తులో బీఆర్ఎస్ తో కలిసి పనిచేసే అవసరం కూడా రావొచ్చు. ప్రస్తుతం బీజేపీ లక్ష్యం లోక్ సభ ఎన్నికలు. గతంతో పోల్చితే బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. గత లోక్ సభ ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల తమ పోరాటం అధికార కాంగ్రెస్ తోనే అని రాజాసింగ్ అన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp