తెలంగాణతో పాటు మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.  అయితే మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా ఎన్నికల హడావుడి  నెలకొంది. ఇప్పటికే టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయని ప్రకటించగా.. వైసీపీ మాత్రం సింగిల్ గానే బరిలో దిగనుంది. ఏపీలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  మరో నాలుగైదు నెలల్లో ప్రజల మధ్య ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 175 స్థానాలకు 175 గెలుపే లక్ష్యంగా ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయంతం చేసేందుకు సన్నద్ధమయ్యారు. అందులో భాగంగానే ఇటీవల ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పార్టీ విస్త్రృత సమావేశాన్ని ఏర్పాటు చేశారు.


ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు,  పార్టీ ఇన్ఛార్జిలు సహా 8వేల మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్టోబరు 25 నుంచి 31 వరకు బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు ఎన్నికలు ఉండవని.. మార్చి,  ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయని తేల్చి చెప్పారు.
ఆలోపు జగనన్న ఆరోగ్య సురక్షా, వై ఏపీ నీడ్స్ జగన్, బస్సుయాత్ర, ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమాలను ప్రకటించింది. వీటితో పాటు వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని దిశా నిర్దేశం చేశారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాలని సూచించారు.


వాస్తవానికి జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నా.. ప్రతిపక్ష నేతగా ఉన్నా ఎప్పుడూ జనంలోనే ఉన్నారు. మూడేళ్ల పాటు పాదయాత్రలో నిత్యం జనంలో ఉన్న అధికారంలోకి వచ్చిన తర్వాత జనానికి దూరమయ్యారని.. జనంలోకి రావాలంటే భయపడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీటికి చెక్ పెడుతూ వచ్చే రెండు నెలల పాటు జనంలో ఉండేలా జగన్ ప్రణాళికలు రచించారు. రోజూ మూడుచోట్ల  కార్యక్రమాలు ఉండేలా చూసుకుంటున్నారు. తద్వారా ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు.  జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేధం ప్రస్తావన లేకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: