జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో ఎన్నికల ముందు వరకు కూడా జగన్ కానీ వైసీపీ నేతలు కానీ పూర్తి స్థాయిలో విరుచుకుపడేవారు. జగన్ అయితే వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావిస్తూ కామెంట్లు చేసేవారు. ఇక ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న మంత్రుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. పవన్ మీద అంతా ఒక్కటిగా చేరి తమ బాణాలు ఎక్కుపెట్టేవారు.
ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తిగా వైసీపీలో మార్పు వచ్చింది. అది కూడా జగన్ స్థాయి నుంచి అనే చెప్పాలి. గత నాలుగు నెలలుగా పవన్ ని ఒక్క మాట కూడా అనడం లేదు. సీఎం హోదాలో జగన్ పవన్ పేరుని తలవకుండా దత్త పుత్రుడు అని పేరు పెట్టి ర్యాగింగ్ చేసేవారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన సాయంత్రమే మీడియా ముందుకు వచ్చి తన రెస్పాన్స్ తెలియజేశారు.
పవన్ కల్యాణ్ గారికి అభినందనలు అంటూ సంభోదించారు. ఈ తర్వాత ఆయన పవన్ గురించి ఏ మాత్రం విమర్శలు చేయడం లేదు. వైసీపీ నేతలు అలానే ఉన్నారు. అటువంటి జగన్ పిఠాపురం వచ్చారు. వరద బాధితుల పరామర్శ కోసం వచ్చిన ఆయన పవన్ సొంత నియోజకవర్గంలో ఆయన మీద విమర్శలు చేస్తారని అందుకే పిఠాపురాన్ని ఎంచుకున్నారని అనుకున్నారు. కానీ జగన్ అన్నీ చంద్రబాబు మీద విమర్శలు ఎక్కుపెట్టారు. పైగా పవన్ ప్రస్తావన ఆయన తెస్తూ పాపం పవన్ కల్యాణ్ అన్నారు.
పవన్ సినిమా స్టార్ అని కూడా అన్నారు. కానీ ఆయనను మించిపోయిన డ్రామా ఆర్టిస్ట్ చంద్రబాబు అని అన్నారు. పవన్ కొత్తగా బాధ్యతలు చేపట్టారు. కానీ అన్నీ తెలిసిన చంద్రబాబు మాత్రం అచ్చమైన డ్రామా ఆర్టిస్టు అయిపోయారు అని జగన్ నిందించారు. ఈ విధంగా పవన్ మీద పాపం అంటూ పాజిటివ్ గా జగన్ రియాక్ట్ అవడం చూసి పలువురు వాటే చేంజ్ అని అంటున్నారు. పవన్ పేరు ఎత్తడానికి సంకోచించే జగన్.. ఆయన పట్ల సానుకూలంగా మాట్లాడటం చూసి జనసేన అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి