కంటికి కనిపించని కరోనా వైరస్ మానవాళిని అతలాకుతలం చేస్తోంది. ఇంతటి సాంకేతిక యుగంలోనూ మనిషికి అంతుచిక్కకుండా ఆగమాగం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 20వేల మందికిపైగా పొట్టనబెట్టుకుంది. సుమారు ఐదు లక్షల మందికి ఇప్పటికే సోకింది. రోజురోజుకూ దాని బారినపడేవారి సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. ఇదే సమయంలో మరణాలు కూడా ఆగడం లేదు. అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. సుమారు నాలుగు నెలలు కిందట బయటపడిన ఈ కరోనా వైరస్కు ఇప్పటికీ విరుగుడు మాత్రం లేకుండాపోయింది. కేవలం దాని వ్యాప్తిని కట్టడి చేసేందుకే ప్రపంచదేశాలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. అయితే.. అసలు ఈ కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది..? మనిషికి ఎలా వ్యాప్తి చెందింది..? దాని పరిమాణం ఎంత ఉంటుంది..? అనే ప్రశ్నల్లో కొన్నింటికి మాత్రం సమాధానలు దొరుకుతున్నాయి.
నిజానికి.. ఈ కరోనా వైరస్పై ప్రజలకు అనేక అపోహలు ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే.. ఎవరికితోచినట్లు వారు పోస్టులు పెడుతున్నారు.. ఈ వైరస్కు మందు తయారైందని ఒకరు పోస్ట్ చేస్తే.. అదిగదిగో అక్కడ ఇప్పటికే ఆ మందును వాడుతున్నారంటూ.. ఇష్టారాజ్యంగా ప్రచారం చేస్తున్నారు. కానీ.. కరోనా మహమ్మారికి ఇప్పటికీ వ్యాక్సిన్ లేదని ప్రపంచ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి.. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సామాజిక దూరం పాటించాలని చెబుతున్నారు. వైరస్ సోకకుండా తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవాలని, దగ్గు తుమ్ము వచ్చినప్పుడు చేతితో రుమాలును అడ్డుపెట్టుకోవడం.. మనిషి మనిషికి మధ్య దూరం ఉండేలా చూసుకోవడం.. పాటించాలని అంటున్నారు. అంతేగానీ.. వ్యాక్సిన్ అయితే..ఇప్పటికీ ప్రయోగదశలోనే ఉందని అంటున్నారు.
అయితే.. ఈ భూమిపై కొన్ని కోట్ల వైరస్లు ఉన్నాయని, అవి కొన్నివేల కోట్ల ఏళ్లపాటు నిర్జీవంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే.. అవి ఏదైనా జీవి శరీరంలోకి చేరగానే.. ఒక్కసారిగా క్రియాశీలమవుతాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే చైనాలోని వుహాన్ నగరంలో కూడా ఈ కరోనా వైరస్ గబ్బిలం ద్వారా అక్కడి ప్రజలకు చేరి ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ వైరస్ పరిమాణం తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.. కరోనా వైరస్ వెంట్రుక వెడల్పులో వెయ్యోవంతు పరిమాణంలో ఉంటుందని, అది మానవుడి శరీరంలోకి ప్రవేశించగానే అతని కణాలను హైజాక్ చేసి కొద్ది సమయంలోనే కొన్నిమిలియన్ కణాలుగా వృద్ది చెందుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే అది అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.