జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పైరసీని అరికట్టడంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరియు కమిషనర్ వి.సి. సజ్జనార్ తీసుకున్న చర్యలను మరోసారి ప్రశంసించారు. 'ఐబొమ్మ' (iBomma), 'బప్పం టీవీ' (Bappam TV) వంటి ప్రధాన పైరసీ వెబ్‌సైట్‌ల నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, ఇది తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు, యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తుందని పేర్కొన్నారు.

డబ్బుల రూపంలోనే కాకుండా, సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలు విడుదలైన రోజునే ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా విడుదలే ఒక మహా యజ్ఞంగా మారిన తరుణంలో, పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శకనిర్మాతలకు సాధ్యం కావడం లేదన్నారు.

పైరసీలో కీలకంగా ఉన్న 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్‌సైట్‌ల నిర్వాహకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, అతనితోనే ఆ సైట్‌లను మూయించివేయడం స్వాగతించదగ్గ పరిణామం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు పెరిగిన తరుణంలో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ బృందం చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని ఆయన అభినందించారు.

ఈ ఆపరేషన్‌లో భాగమైన పోలీసులకు, సిటీ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ (Ponzi Schemes) లాంటి వాటిపై దృష్టి కేంద్రీకరించి, వాటి వల్ల ప్రజలు ఆర్థికంగా మోసానికి గురవుతున్న విషయాన్ని చైతన్యపరుస్తున్న సజ్జనార్ కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకువచ్చిందని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆయన నేతృత్వంలో చేపట్టే చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు, యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: