శివుడి ఆవిర్భావం... భావోద్వేగ ఘట్టం!
'అఖండ' మొదటి భాగంలో శివుడి ప్రస్తావన ప్రతీకాత్మకంగా ఉంటే, 'అఖండ 2'లో మాత్రం ఏకంగా పరమేశ్వరుడి ఆవిర్భావమే కథలో కీలక ఘట్టంగా మారింది. కథలో అఖండ తల్లి మరణించే సందర్భంలో వచ్చే ఒక సన్నివేశం థియేటర్లలో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. కైలాసంలో ఉన్న శివుడు స్వయంగా భూమిపైకి దిగి వచ్చి, అఖండ తల్లి చితికి అగ్నిసంస్కారం చేసే ఘట్టాన్ని బోయపాటి అత్యంత భక్తిభావంతో, విజువల్ గ్రాండ్యూర్తో తెరకెక్కించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం), విజువల్స్ కలగలిసి ఆ ఎపిసోడ్ను రుద్ర తాండవాన్ని గుర్తు చేసేలా నిలిపాయి.
శివుడిగా 'సుపరిచితుడు' తరుణ్ ఖన్నా!
ఈ కీలక ఘట్టంలో పరమేశ్వరుడి పాత్రలో నటించింది ఎవరా అని అందరూ ఆసక్తిగా అన్వేషిస్తున్నారు. ఆ పాత్రను పోషించింది బాలీవుడ్కు చెందిన నటుడు తరుణ్ ఖన్నా. హిందీ టెలివిజన్ ప్రేక్షకులకు తరుణ్ ఖన్నా శివుడిగా సుపరిచితుడు. 2015లో 'సంతోషి మా' సీరియల్లో తొలిసారి శివుడిగా నటించిన ఆయన, ఆ తర్వాత 'కర్మఫల్ దాత శని', 'పరమావతార్ శ్రీ కృష్ణ', 'శ్రీమద్ రామాయణ' వంటి అనేక మైథలాజికల్ సీరియల్స్లో అదే పాత్రలో మెప్పించారు.
శివుడి పాత్రలో ఆయనకున్న ఈ పదేళ్ల అనుభవం, గంభీరత 'అఖండ 2'లో ఆయన అవలీలగా ఒదిగిపోయేలా చేశాయి. ఆయన తెరపై అడుగుపెట్టిన ప్రతి సన్నివేశం 'గుసగుసలు' తెప్పిస్తోందనే టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణతో నేరుగా సంభాషణ సన్నివేశాలు లేకపోయినా, క్లైమాక్స్లో ఇద్దరూ ఒకే ఫ్రేమ్లో తాండవం చేసే సీన్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఉత్తరాది ప్రేక్షకులకు శివుడిగా తరుణ్ ఖన్నా పరిచయం ఉండటం, ఈ పాత్ర ద్వారా 'అఖండ 2: తాండవం' పాన్ ఇండియా స్థాయిలో మరింతగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని, సినిమాకు కలెక్షన్ల సునామీకి దారి తీస్తుందని యూనిట్ భావిస్తోంది. మొత్తంగా, బాలయ్య మాస్ ఎలివేషన్లకు తోడు, తరుణ్ ఖన్నా అందించిన పవర్ఫుల్ శివుడి పాత్ర ఈ సినిమాను భక్తి, పవర్ మేళవించిన ప్రత్యేకమైన మాస్ జాతరగా మార్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి