తమిళనాట జరుగుతున్న అధికారపోరాటంలో పన్నీర్ సెల్వం వర్గానిదే పైచేయిగా కనిపిస్తోంది. శశికళ రిసార్టు రాజకీయం వికటించేలా కనిపిస్తోంది. గవర్నర్ రిసార్టులో బంధించిన వారి పరిస్థితిపై దృష్టి సారించారు. శశికళ మెజారిటీ చూపించుకుంటున్నా..దాన్ని గవర్నర్ విశ్వసిస్తేనే ప్రయోజనం. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో నిన్న పన్నీర్ సెల్వం వర్గంలో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు మిన్నంటాయి. అందుకు కారణం శశికళకు సుప్రీంకోర్టు నుంచి సమన్లు అందాయన్న వార్త. ఇప్పుడు ఇది ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. పన్నీర్ వర్గం ఆనందంతో గంతులేయడానికి కూడా ఇదే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గురువారం రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్రావును కలిసి వచ్చినప్పటి నుంచి పన్నీర్ సెల్వం హుషారుగా కనిపిస్తున్నారట.
శశికళ.. జయలలిత మృతి తర్వాత, ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి, జాగ్రత్తగా పావులు కదిపినా ఆమెకు కాలం కలసిరావడం లేదు. ఆమె సీఎం కావడం దాదాపు అసంభవంగా కనిపిస్తోందని తమిళ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అనేక వైరుధ్యాలున్న శక్తులు సైతం ఒక్కటై ఆమెకు వ్యతిరేకంగా నిలుస్తున్నాయి. అధికారం దక్కకుండా అడ్డుగోడలవుతున్నాయి.
మరోవైపు శశికళకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. డీఎంకే కార్యానిర్వాహకఅధ్యక్షుడు, ప్రతిపక్ష నేత స్టాలిన్ రాజ్భవన్ వెళ్లి గవర్నర్ విద్యాసాగర్రావును కలిశారు. సెల్వం బలపరీక్షకు అవకాశం ఇవ్వాలని కోరారు. గవర్నర్ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో మరొకరోజు వేచి చూసి రాష్ట్రపతి తలుపు తట్టాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలందరినీ తీసుకుని ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు పరేడ్ నిర్వహించాలని భావిస్తున్నారు.