తెలుగు,తమిళ ఇండస్ట్రీలో 90వ దశకంలో తన అందాలతో కుర్రకారు మతులు పోగొట్టిన హీరోయిన్ ఖుష్బు. తెలుగు లో తక్కువ చిత్రాల్లో నటించినా తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఖుష్బూని తమిళ అభిమానులు ఎంతగా అభిమానించే వారంటే..ఏకంగా గుడి కట్టించి పూజలు కూడా చేశారు. అయితే హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న ఖుష్బు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సినిమాల్లో కూడా నటిస్తున్నారు.
ఈ మద్య పవన్ కళ్యాన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో పవన్ తల్లిగా నటించారు. తాజాగా నటి ఖుష్బూకి తమిళనాడు కాంగ్రెస్ నాయకులు పెద్ద షాక్ ఇచ్చారు. గత కొంత కాలంగా ఖుష్బూ వ్యవహార శైలి బాగాలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీ నటి ఖుష్బూ తమిళనాడు కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఖుష్బూ స్థానిక శాఖ నాయకులను పట్టించుకోవడమే లేదని ఆరోపించారు. తిరునల్వేలిలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ ఆధ్వర్యలో జరిగే కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం చెన్నై నుంచి విమానంలో తూత్తుకుడికి చేరుకున్నారు.
అయితే ఖుష్బూ తన పర్యటన గురించి ముందుగా తిరునల్వేలి కాంగ్రెస్ కమిటీ నాయకులకు ఎలాంటి సమాచారం అందించకుండా ఈ పర్యటన చేపట్టారు. దీంతో, ఆమె పర్యటనను నిరసిస్తూ తిరునల్వేలిలోని డీసీసీ కార్యాలయాన్ని స్థానిక నాయకులు మూసివేసి తాళం వేశారు. ఈ విషయమై స్థానిక నాయకుడు ఒకరు మాట్లాడుతూ, జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలను గానీ, సామాన్య కార్యకర్తలను గాని ఆమె పట్టించుకోవడం లేదని, ఆమె తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడు కాంగ్రెస్ నాయకుల వైఖరిపై నటి ఖుష్బు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై నటి ఖుష్బూ స్పందిస్తూ, పార్టీని అభివృద్ధి పరిచే ఆలోచనతో జిల్లా వారి పర్యటనలు చేపడుతుంటే, సొంతపార్టీ నాయకులే అడ్డుపడటం సబబు కాదని, పార్టీ ప్రతిష్ఠను దిగజార్చే చర్యలకు పాల్పడవద్దని ఆమె హితవు పలికారు.