దేశంలో రోజురోజుకీ మోడీ ప్రభావం తగ్గడంతో ఎన్డీయేలో ఉన్న రాజకీయ పార్టీలు ఎన్డీయే కూటమి నుండి బయటకు రావడానికి సిద్ధపడుతున్నాయి. ఇంతకుముందు వరకు మోడీతో సఖ్యతగా ఉన్న రానురాను కేంద్రంలో చాలా కఠినమైన నిర్ణయాలు మోడీ ఏకపక్షంగా తీసుకోవడంతో..బయటకు రావడానికి ఎన్డీఏ మిత్రపక్షాలు సిద్ధపడుతున్నాయి. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా బిజెపి పార్టీకి దేశంలో ఎదురుగాలి వీస్తోంది అని అంటున్నారు.
దీనంతటికీ కారణం మోడీ ఏకపక్ష ధోరణి అని ఎన్డీయే కూటమిలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల చంద్రబాబు ఎన్డీయే కూటమిలో నుండి బయటకు రావడంతో...ఇప్పటివరకు మోడీపై ఆగ్రహాన్ని గుండెల్లోనే దిగమింగుకుని సర్దుకుపోయిన ఎన్డీయే పక్షాలు బయటకు రావడానికి సిద్ధపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలలో వచ్చిన వ్యతిరేక ఫలితాలు బీజేపీ సమర్థతపై ఎన్డీయే కూటమి పక్షాలకు అనుమానం ఏర్పడేలా చేసింది.
ఆ వెంటనే ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ వైదొలగడం, శివసేన లాంటి మరో పార్టీ కూడా బీజేపీ ధోరణిని జీర్ణించుకోలేక చాలా కాలంగా దూరం జరగడం మిగిలిన పార్టీలపై గట్టి ప్రభావమే చూపింది. ఈ పార్టీలు కూడా బాహాటంగానే తమ అసంతృప్తిని ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ నిష్క్రమించాక- బీజేపీపై ఒత్తిడి పెరిగిందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
చాలా కాలమై ఎన్డీఏ సమన్వయ సమావేశం నిర్వహించకపోవడాన్ని పలు పార్టీలు తప్పుబడుతున్నాయి. అంతేకాకుండా మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలపైన డేగ కన్ను పెడుతూ మోడీ అమిత్ షా అవలంబిస్తున్న ధోరణిని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఎన్డీఏ కూటమిలో వున్నా చాలా రాజకీయ పార్టీలు బయటకు రావడానికి సిద్ధపడుతున్నాయి.