ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతుండ‌గా...వివిధ కంపెనీలు త‌మ వ్యాపార నిర్వ‌హ‌ణ గురించి ఆలోచిస్తున్న త‌రుణంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి భారీ తీపిక‌బురు ద‌క్కింది. ఏకంగా 1200 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డిని తెలంగాణ స‌ర్కారు ఆక‌ర్షించింది. మెడికల్ డివైస్ తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మెడ్ ట్రానిక్స్ తెలంగాణను తన పెట్టుబడి గమ్యస్థానంగా ఎంచుకుంది. అమెరికా బ‌య‌ట‌ తన రెండో అతిపెద్ద డెవలప్మెంట్ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సుమారు 1200 కోట్ల రూపాయలతో తన ప్రస్తుత కార్యకలాపాలను విస్తరించనుంది. ప్రస్తుతం ఉన్న తన పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని మరింతగా విస్తరించనుంది.


మెడ్ ట్రానిక్స్ ఇంజనీరింగ్ మరియు ఇన్నోవేషన్ సెంటర్ అమెరికా అవతల అతిపెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కానుంది.  రానున్న ఐదు సంవత్సరాలలో ఈ కేంద్రం విస్తరణ కోసం పన్నెండు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ పెట్టుబడి తో మెడికల్ డివైసెస్ హబ్ గా హైదరాబాద్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం మరియు మెడ్ ట్రానిక్స్ కంపెనీ గత రెండు సంవత్సరాలుగా ఇందుకు సంబంధించిన చర్చలను కొనసాగిస్తున్నాయి. 2016 లో అమెరికాలో పర్యటించిన సందర్భంగా పరిశ్రమలు మరియు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రతినిధి బృందం సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఓమర్ ఇస్రాక్ తో సమావేశమైంది. ఈరోజు ఆయనతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ మేరకు పెట్టుబడికి సంబంధించిన ప్రకటనను తెలియజేయడం జరిగింది.


పరిశోధన మరియు అభివృద్ధి అనేది ఇన్నోవేషన్ కి దారితీస్తుందని, ఇన్నోవేషన్ అనేది తమ కంపెనీ అభివృద్ధికి అత్యంత కీలకమైనదని కంపెనీ చైర్మన్ ఒమర్ ఇస్రాక్ ప్రకటించారు. ఈరోజు ప్రకటించిన పెట్టుబడి భారతదేశం పట్ల తమ కమిట్మెంట్ కి, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తో కలిసి పని చేసేందుకు తాము తీసుకున్న నిర్ణయాన్ని సూచిస్తుందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా కంపెనీ తన లక్ష్యాలకు అనుగుణంగా కొనసాగుతుందన్నారు. రోగుల బాధను దూరం చేసి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలన్న తమ కంపెనీ లక్ష్యాలతోపాటు, అరోగ్య రంగాన్ని మరింతగా విస్తరించాలన్న ప్రభుత్వ లక్ష్యాల మేరకు ఈ భాగస్వామ్యం ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు.


ఈరోజు జరిగిన వర్చువల్ మీటింగ్ లో భాగంగా మంత్రి కే. తారకరామారావు మెడ్ ట్రానిక్స్ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను వివరించారు. ముఖ్యంగా మెడికల్ డివైస్ రంగంలో గత కొన్ని సంవత్సరాలుగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. తన అమెరికా పర్యటనలో కంపెనీ చైర్మన్‌గా ఎంపికైన సందర్భంగా ఒమర్ కు అభినందనలు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతోపాటు జెఫ్రీ .యస్. మార్తా కంపెనీ నూతన సీఈఓగా ఎంపిక అయినందుకు అభినందనలు తెలియజేశారు.


కాగా, మెడ్ ట్రానిక్స్ కంపెనీ హైదరాబాద్ నగరాన్ని తమ అతిపెద్ద ఆర్ అండ్ డి సెంటర్ కి గమ్యస్థానం ఎంచుకోవడం పట్ల మంత్రి కెటియార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పనతో పాటు,ఈ రంగంలో మరిన్ని నూతన పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ప్రస్తుతం మెడ్ ట్రానిక్స్ పెడుతున్న పెట్టుబడి హైదరాబాద్ నగరాన్ని భారతదేశ మెడికల్ డివైసెస్ హబ్ గా మారుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మెడ్ టెక్ రంగ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఈరోజు మెడ్ ట్రానిక్స్ తో జరుగుతున్న ఒప్పందం దీన్ని సూచిస్తుందని తెలిపారు. మెడికల్ డివైసెస్ కంపెనీలతో కలిసి పనిచేస్తూ ప్రపంచ ఆరోగ్య రంగంలో సానుకూల మార్పు దిశగా పని చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపార ధోరణులను పరిశీలించినప్పుడు భారతదేశానికి ఈ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు.

కంపెనీ యొక్క భారత ఉపఖండ ఉపాధ్యక్షుడు మదన్ కృష్ణ మాట్లాడుతూ దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న రోగులకు తమ కంపెనీ యొక్క ఆవిష్కరణ ద్వారా ఉపశమనం కల్పించాలన్న ఉద్దేశంతో కంపెనీ ఇన్నోవేషన్ కి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రస్తుతం తాము చేస్తున్న ఈ పెట్టుబడి ద్వారా హెల్త్ కేర్ రంగంలో అనేక ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుతం కంపెనీ కార్యకలాపాల విస్తరణ ద్వారా ఇక్కడి ఇంజనీరింగ్ విద్యార్థులు తమ మెడ్ ట్రానిక్స్ కంపెనీతో కలిసి  పని చేసేందుకు వీలు కలుగుతుందని, తద్వారా హెల్త్కేర్ రంగంలో అనేక మార్పులకు కారణం అయ్యే అవకాశం ఉందన్నారు. తమ విస్తరణ ద్వారా భారతదేశ మెడికల్ డివైసెస్ ఇన్నోవేషన్ ఈకో సిస్టం బలోపేతం చేసేందుకు కూడా ఉపయోగపడుతుందన్న అభిలాష వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: