అంతకంతకూ దిగజారుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, యువతలో పెరుగుతున్న నిరుద్యోగం మునుముందు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి పెను సవాలుగా మారనున్నాయనే అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో గత ప్రభుత్వాల హయాంలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక నిధులు ఖర్చు చేయడంతో అది పలు దేశ, విదేశీ వ్యాపార సంస్థలకు పెట్టుబడుల గమ్య స్థానంగా
మారింది. ఆ నగరంలో పలు సంస్థలు నెలకొల్పడంతో సమాంతరంగా రియల్ ఎస్టేట్ ధరలు పెరగడం తద్వారా అక్కడి ప్రభుత్వానికి విశేషంగా ఆదాయం సమకూరింది కూడా. అదే సమయంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో వసతుల కల్పన అరకొరగానే ఉండటంతో అగ్రశ్రేణి ఐటీ సంస్థలేవీ ఇతర నగరాల వైపు కన్నెత్తి చూడలేదు. ఈ పరిస్థితినే ప్రతిఫలిస్తూ ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి చూసినా 95 శాతం ఐటీ ఎగుమతులు హైదరాబాద్ నుంచే జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వరంగల్ను కూడా భవిష్యత్తులో ఐటీ పరిశ్రమల హబ్గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ కూడా మొదలుపెట్టింది. ఇక ఏపీలో ఇలా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సానుకూలతలన్నీ విశాఖ నగరానికి ఉన్నాయి. కావాల్సిందల్లా ఏపీ ప్రభుత్వం తగిన చొరవచూపడం మాత్రమే.